మధుర మీనాక్షి ఆలయం: పెట్రోల్ బాంబుల దాడి
చెన్నై: తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన శ్రీ మధుర మీనాక్షి దేవాలయం సమీపంలో పెట్రోల్ బాంబులు వెయ్యడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబులు విసిరి పరారైనారు.
పెట్రోల్ బాంబులు విసరడంతో మధుర మీనాక్షి దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుండగులు విసిరిన పెట్రోల్ బాంబుల్లో ఒక్కటే పేలిందని, ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు అన్నారు.
పగిలిన బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ భద్రతా దళాలు ఆలయంలో భద్రతా ఏర్పాట్లు సమీక్షించిన కొన్ని గంటల తరువాత ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ విశ్వనాథన్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. రక్షణ వ్యవస్థ, సీసీ టీవీ కెమెరాలు, స్కానింగ్ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
దర్యాప్తు పూర్తి అయిన తరువాత వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం ఉగ్రవాదులు దాడి చెయ్యలేదని దర్యాప్తులో వెలుగు చూసిందని పోలీసు అధికారులు అన్నారు.
వెంటనే దేవాలయంలో భద్రతా వ్యవస్థలో కొన్ని మార్పులు చెయ్యాలని డీఎస్పీ విశ్వనాథ్ అధికారులకు సూచించారు, ఆలయ సిబ్బంది, భక్తులు మొబైల్ వాడకాన్ని ఇక్కడ పరిమితం చెయ్యాలని మనవి చేశారు. దేవాలయం లోపల జామర్ ఏర్పాటు చెయ్యాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.