పట్ట పగ్గాల్లేని పెట్రోల్, డీజిల్ ధరలు: మళ్లీ పెంపు: ఎనిమిది రోజుల్లో ఆరుసార్లు
న్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ ఎగబాకాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వాహనదారుల వీపు విమానం మోత మోగించిన చమురు సంస్థలు.. రెండు రోజుల విరామం అనంతరం మళ్లీ వాటి రేట్లు పెంచాయి. రెండురోజుల విరామం అనంతరం వరుసగా రెండోసారి ఇంధన ధరలను పెంచేశాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఆరుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. శని, ఆదివారాల్లో ఇంధన ధరల జోలికి వెళ్లని చమురు సంస్థలు.. ఆ మరుసటి రోజే వాటిపై పడ్డాయి. సోమ, మంగళవారాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లను అమాంతం పెంచేశాయి. దీని ప్రభావంతో దేశ ఆర్థిక రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 98 రూపాయలకు పైగా చేరింది.
Recommended Video
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 27 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 20 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.91.80, డీజిల్ 82.36 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 98.12 రూపాయలు ఉంటోంది. డీజిల్ ధర 89.48 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 98 రూపాయలు చేరడం చరిత్రలో ఇదే తొలిసారి. చెన్నైలో పెట్రోల్ రూ. 93.62, డీజిల్ ధర రూ. 87.25, కోల్కతలో పెట్రోల్ రూ.91.92 పైసలు, డీజిల్ ధర రూ.85.20 పైసలు పలుకుతోంది. మహారాష్ట్రలోని పర్భణీలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్క్ను దాటింది. అక్కడ రూ.100.50 పైసలు పలుకుతోంది.
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ 102 రూపాయల మార్క్ను దాటింది. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 102.70 పైసలుగా రికార్డయింది. దేశం మొత్తం మీద ఇక్కడే పెట్రోల్ రేటు అత్యధికంగా రికార్డయింది. మధ్యప్రదేశ్లోని నగరాబంధ్, అనూప్పూర్, రీవా, ఛింద్వాడలో ఇదే పరిస్థితి కనిపించింది. నగరాబంధ్లో లీటర్ పెట్రోలు 102.95 పైసలు, అనూప్పూర్లో 102.40కు చేరింది. రీవాలో పెట్రల్ లీటర్ ఒక్కింటికి 102.04, ఛింద్వాడలో 101.67 పైసలు పలుకుతోంది. ఇదివరకు వంద రూపాయల మార్క్ను దాటిన పట్టణం.. శ్రీగంగానగర్ ఒక్కటే ఉండేది. వరుసగా ఇంధన ధరలు పెరగడంతో పలు పట్టణాల్లో పెట్రోల్ రేట్లు వంద రూపాయలకు పైగా చేరాయి. ఈ లిస్ట్లో పర్భణీ చేరింది.