అక్కడ లీటర్ పెట్రోల్ రూ.102లకు పైమాటే: వరుసగా నాలుగో రోజూ ఇంధన ధరలు భగ్గు
న్యూఢిల్లీ: ఇన్ని రోజులూ వాహనదారులకు ఊరట కల్పిస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుదల బాట పట్టాయి. ఈ నెల 4వ తేదీన ఆరంభమైన పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల దూకుడు.. వరుసగా నాలుగో రోజుకు చేరింది. ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన ఇంధన.. దానికి భిన్నంగా నాలుగు రోజుల్లో నాలుగుసార్లు పెరిగాయి. చివరిసారిగా కిందటి నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండోరోజే ఇంధన ధరలు పెరిగాయి. అక్కడితో దాని ప్రస్థానం ఆగలేదు. నాలుగో రోజు కూడా చమురుసంస్థలు వాటి రేట్లను పెంచేశాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 28 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 33 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.91.27, డీజిల్ 81.73 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 97.61 రూపాయలు ఉంటోంది. డీజిల్ ధర 88.82 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 93.15, డీజిల్ ధర రూ. 86.65, కోల్కతలో పెట్రోల్ రూ.91.41 పైసలు, డీజిల్ ధర రూ.84.57 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్-93.92, డీజిల్-86.94, బెంగళూరులో పెట్రోల్-94.30, డీజిల్-86.64, భోపాల్లో పెట్రోల్-99.28, డీజిల్-90.01, చండీగఢ్లో పెట్రోల్-87.80, డీజిల్-81.40,రాంచీలో పెట్రోల్-88.57, డీజిల్-86.34గా రికార్డయ్యాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు విధించిన విలువ ఆధారిత ధరల ప్రకారం.. వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లు ఉంటాయి.
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ 102 రూపాయల మార్క్ను దాటింది. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 102.15 పైసలుగా రికార్డయింది. మధ్యప్రదేశ్లోని నగరాబంధ్, అనూప్పూర్, రీవా, ఛింద్వాడలో ఇదే పరిస్థితి కనిపించింది. నగరాబంధ్లో లీటర్ పెట్రోలు 102.15 పైసలు, అనూప్పూర్లో 101.86కు చేరింది. రీవాలో పెట్రల్ లీటర్ ఒక్కింటికి 101.49, ఛింద్వాడలో 101.13 పైసలు పలుకుతోంది. ఇదివరకు వంద రూపాయల మార్క్ను దాటిన పట్టణం.. శ్రీగంగానగర్ ఒక్కటే ఉండేది. వరుసగా నాలుగురోజుల పాటు ఇంధన ధరలు పెరగడంతో పలు పట్టణాల్లో పెట్రోల్ రేట్లు వంద రూపాయలకు పైగా చేరాయి.