ముగిసిన ఎన్నికలు .. పెట్రోవాత షురూ..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఆయిల్ కంపెనీలు వడ్డింపు మొదలుపెట్టాయి. ఎన్నికల కారణంగా ఇంతకాలం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచని కంపెనీలు ధరల్లో మార్పు చేశాయి. సోమవారం వివిధ నగరాల్లో పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 8 నుంచి 10పైసలు .. డీజిల్ రేటు 15 నుంచి 16 పైసల మేర పెరిగింది. ఎన్నికల దృష్ట్యా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ ఇంతకాలం రేట్లు పెంచకపోవడం గమనార్హం.
క్రూడాయిల్ ఉత్పత్తిలో కోత విధించడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు పతనమవకుండా చూడాలని ఒపెక్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గరిష్టానికి చేరింది. మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సైతం క్రూడ్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ రేటు 1.1శాతం మేర పెరిగి 72.98డాలర్లకు చేరింది. ఇది కాస్తా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసింది.
సోమవారం వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి
సిటీ | పెట్రోల్ (రూ.) | డీజిల్(రూ.) |
హైదరాబాద్ | 75. 43 | 71.90 |
ఢిల్లీ | 71.12 | 66.11 |
కోల్కతా | 73.19 | 67.86 |
ముంబై | 76.73 | 69.27 |
చెన్నై | 73.82 | 69.88 |