వరుసగా రెండో రోజూ అతి స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత 15రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రెండో రోజు కూడా ఆయిల్ కంపెనీలు స్వల్ప మొత్తంలో తగ్గించాయి. బుధవారం వినియోగదారులకు ముష్టివేసినట్లుగా 1పైసా మాత్రమే తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. గురువారం లీటర్ పెట్రోల్పై 7పైసలు, లీటర్ డీజిల్పై 5పైసలు తగ్గించాయి.
ఐఓసీ షాక్: పెట్రోల్, డీజిల్పై తగ్గింది రూపాయి కాదు, 1పైసా మాత్రమే!
అంతర్జాతీయ ఆయిల్ రేట్లు తగ్గుతున్న క్రమంలో దేశీయంగా కూడా ధరలను మెల్లమెల్లగా తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.42 నుంచి 78.35కి తగ్గింది.
అదే విధంగా డీజిల్ ధర కూడా లీటర్ రూ.69.30 ఉండగా 69.25కు తగ్గింది. 15 రోజుల పాటు వరుసగా ధరలు పెరగడంతో, లీటరు పెట్రోల్పై రూ.3.8, డీజిల్పై రూ.3.38 ధర పెరిగింది.
పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి సంబురాలు చేసుకోండంటూ ఆయిల్ కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు. కాగా, పెట్రోల్, డీజిల్ ధరలకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.