LPG Cylinders: పెట్రోల్, డీజిల్ను వదిలేసి వంటగ్యాస్పై: మళ్లీ బాదుడు: రూ.50..రెండు వారాల్లో
న్యూఢిల్లీ: చమురు సంస్థలు ఒకేసారి రెండు భిన్న నిర్ణయాలను తీసుకున్నాయి. తొలుత- పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. పెట్రోల్పై లీటర్ ఒక్కింటికి 10 నుంచి 15 పైసలు, డీజిల్పై లీటర్ ఒక్కింటికి 14 నుంచి 15 పైసల మేర తగ్గించాయి. చమురు సంస్థలు ఇంధన ధరలను తగ్గించాయనే ఆనందం వాహనదారుల్లో ఎంతో సేపు నిలవలేదు. వారి ఆనందం ఆవిరయ్యేలా చేశాయి. వంటగ్యాస్ ధరలను భారీగా పెంచేశాయి ఆయిల్ కంపెనీస్. ఎల్పీజీ సిలిండర్ ఒక్కింటికి 25 రూపాయలను పెంచేశాయి.
15 రోజుల్లోనే 50 రూపాయలు..
రెండువారాల వ్యవధిలో ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచేయడం ఇది రెండోసారి. ఇదివరకు- ఈ నెల 18వ తేదీన తొలిసారిగా వంటగ్యాస్ సిలిండర్ల ధరను 25 రూపాయల మేర పెంచిన విషయం తెలిసిందే. అంతలోనే మరోసారి పెంపుదలకు పూనుకున్నాయి. మళ్లీ 25 రూపాయలను పెంచాయి. ఫలితంగా- ఈ 15 రోజుల వ్యవధిలోనే 50 రూపాయలను అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారులపై పడింది.
నాన్ సబ్సిడీ ఎల్పీజీపై 75 రూపాయలు..
గృహావసర వినియోగదారులపైనే కాదు.. కమర్షియల్ కన్జ్యూమర్స్పైనా భారం మోపాయి చమురు కంపెనీలు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను 75 రూపాయల చొప్పున పెంచాయి. తాజా పెంపుదలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధర 900 రూపాయలను దాటేసింది. గృహ, వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీ సిలిండర్లను వినియోగించే వారిపై రెండు వారాల వ్యవధిలో 50 రూపాయల మేర అదనపు భారం పడినట్టయింది.
అక్కడ రూ.900
తాజా పెంపుతో 14.2 కిలోల బరువు ఉండే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర దేశ రాజధానిలో 884.50 పైసలకు చేరింది. కమర్షియల్ సిలిండర్ రేటు 1,693 రూపాయలకు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా అంటే తాజా పెంపు వరకు చమురు సంస్థలు వంటగ్యాస్ సిలిండర్లపై మోపిన అదనపు భారం 190 రూపాయలు. కిందటి నెల 18వ తేదీన 25 రూపాయల మేర ఎల్పీజీ సిలిండర్ రేటును పెంచిన ఆయిల్ కంపెనీలు.. 15 రోజుల్లోనే మరోసారి వాత వేయడం ఏ మాత్రం ఊహించని పరిణామం.
ముంబై ఎల్పీజీ సిలిండర్ ధర
తాజా పెంపుతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గృహావసర ఎల్పీజీ సిలిండర్ ధర రూ.884.50 పైసలకు చేరింది. మంగళవారం నాటి ధర 859.50 పైసలుగా నమోదైంది. చెన్నైలో వంటగ్యాస్ ధర అత్యధికంగా నమోదైంది. 900 రూపాయలను దాటేసింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 900.50 పైసలకు చేరింది. లక్నోలో రూ. 897.50 పైసలుగా నమోదైంది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు తగ్గించాయని ఆనందించే లోపే దానికి ఎన్నో రెట్ల అదనపు భారాన్ని డొమెస్టిక్, నాన్ సబ్సిడీ సిలిండర్లపై మోపినట్టయింది.
పెంపుదల ఇలా..
జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 190 రూపాయల మేర పెరిగింది ఎల్పీజీ సిలిండర్ల ధర. తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన 25 రూపాయల మేర పెరిగంది. అదే నెల 15వ తేదీన ఏకంగా 50 రూపాయల మేర వాటి రేటును పెంచాయి చమురు సంస్థలు. 25వ తేదీన మరో 25 రూపాయల మేర అదనపు భారాన్ని మోపాయి. మార్చి 1వ తేదీన 25 రూపాయలు, ఏప్రిల్ 1వ తేదీన 10 రూపాయలు, జులై 1వ తేదీన 25 రూపాయల మేర పెంచాయి. ఆగస్టు 18వ తేదీన 25 రూపాయలు పెంచాయి. తాజాగా మళ్లీ 25 రూపాయల భారం మోపాయి.
థ్యాంక్యూ మోడీజీ అంటూ
ఇలా వరుసగా వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుకుంటూ పోవడం పట్ల వినియోగదారులు అసహనం వ్యక్తమౌతోంది. థ్యాంక్యూ మోడీ జీ అంటూ తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు నెటిజన్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద మెమెస్ సృష్టిస్తోన్నారు. రేట్లను పెంచుకుంటూ, దేశ ప్రజలపై అదనపు భారాన్ని మోపడంలో నరేంద్ర మోడీ సర్కార్ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోందంటూ ఎద్దేవా చేస్తోన్నారు. ఇదివరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో సిలిండర్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ స్మృతి ఇరానీ రోడ్డెక్కిన ఉదంతాన్ని గుర్తు చేస్తోన్నారు. ఇప్పుడామె ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తోన్నారు.












Click it and Unblock the Notifications