నా ఫోన్కు ప్లాస్టర్ చుట్టుకున్నా -మోదీని తరిమేసేలా ఢిల్లీకి ఖేలా హోబే -ప్రధాని స్థాయిలో మమత సంచలనం
దేశంలో ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, దాదాపు ప్రధానమంత్రి స్థాయిలో ఇతర రాష్ట్రాల్లోని ప్రజలనూ ఉద్దేశించి లైవ్ లో ప్రసంగించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రస్తుత మోదీ సర్కార్ వల్ల దేశంలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను వివరిస్తూ, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపుదామని దేశ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. కేంద్రం దొంగ చాటుగా నిఘాకు పాల్పడినట్లు వెల్లడైన 'పెగాసస్' ఉదంతంపైనా దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆరు రాష్ట్రాల్లో లైవ్ స్ట్రీమింగ్
మమతా బెనర్జీ నాయకత్వంలోని ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ఏటా జులై 21న అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తుండటం ఆనవాయితీ. రాజకీయ పోరాటంలో అసువులబాసిన కార్యకర్తలను స్మరించుకునే ఆ కార్యక్రమాన్ని ఈసారి అసాధారణ రీతిలో నిర్వహించారు. కోల్ కతాలో ఏర్పాటు చేసిన భారీ సభను ఉద్దేశించి సీఎం మమత చేసిన ప్రసంగాన్ని మొత్తం ఆరు రాష్ట్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పశ్చిమ బెంగాల్ తోపాటు అస్సాం, త్రిపుర, ఢిల్లీ, ఎన్నికల రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ లోని ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి మమత ప్రసంగాన్ని వినిపించారు.

గుజరాత్లో దీదీ ఫ్లెక్సీలు చింపివేత
గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒక చోట ప్రసంగిస్తే, దాన్ని చుట్టుపక్కల జిల్లాల్లోనూ స్క్రీన్ల ద్వారా ప్రసారం చేసింది బీజేపీ. మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్థాయిలో మమత బెంగాల్ నుంచి చేసిన ప్రసంగాన్ని మరో ఐదు రాష్ట్రాల్లో ప్రసారం చేసింది టీఎంసీ. కాగా, మమత ప్రసంగం కోసం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన స్క్రీన్లను స్థానిక బీజేపీ ప్రభుత్వం తొలగించడం వివాదాస్పదమైంది. గుజరాత్ లో పలు చోట్ల వెలసిన దీదీ ఫ్లెక్సీలను సైతం స్థానిక బీజేపీ పాలకులు తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఇక,

ఇక ఢిల్లీకి ఖేలా హోబే నినాదం
అమరవీరుల దినోత్సవం సందర్భంగా టీఎంసీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన మమతా బెనర్జీ కీలక సందేశాన్నిచ్చారు. దేశంలో బడా కార్పొరేట్ల గుప్పిట్లో ఉన్న బీజేపీ తన ధన బలం, కండకావరంతో రాష్ట్రాలను, ఇతర పార్టీల నేతలను లొంగదీసుకోవాలనుకుంటోందని, అయితే, కాషాయ మూకలకు ధీటుగా టీఎంసీ సహా విపక్ష పార్టీల కార్యకర్తలెందరో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేసిన 'ఖేలా హోబే' నినాదాన్ని ఇకపై ఢిల్లీకి తీసుకెళుదామని, కేంద్రంలో మోదీ సర్కారును గద్దెదించి వెళ్లగొట్టేదాకా 'ఖేలా హోబే' నినాదంతో పోరాడుదామని దీదీ పిలుపునిచ్చారు. అంతేకాదు,

మోదీకి భయపడి ఫోన్కు ప్లాస్టర్
''మిత్రులారా.. బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కేంద్ర పెద్దల కనుసన్నల్లో పెద్ద ఎత్తున నిఘా కుట్రలు సాగుతున్నట్లు బట్టబయలైంది. పెగాసస్ నిఘా సాఫ్ట్ వేర్ తో విపక్ష నేతలు, జడ్జిలు, జర్నలిస్టులు.. యావత్ సమాజంపైనే బీజేపీ కుట్రలు పన్నింది. మోదీ నిఘా కుట్రల నుంచి తప్పించుకోడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. నేనైతే నా మొబైల్ ఫోన్ కు ప్లాస్టర్ అంటించుకున్నాను. కనీసం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడటానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. కేంద్రం నిఘా వల్ల చాలా సార్లు నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాల్సి వస్తోంది. ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ బీజేపీ వాళ్లకు తమ మంత్రులు, ఎంపీలపైనే నమ్మకం లేక, వాళ్లపైనా నిఘా పెట్టారు..'' అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా,

2024లో మోదీ వర్సెస్ దీదీ
రాబోయే సార్వత్రిక ఎన్నికలనాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటి కావాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. అమరుల దినోత్సవం సందర్భంగా ఈ మేరకు పిలుపునిచ్చిన ఆమె.. అతి త్వరలోనే ఢిల్లీలో పర్యటించి, సోనియా గాంధీ సహా విపక్ష పార్టీల నేతలను కలవనున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే విషయమై విపక్షాలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు రావడంతో 2024లో మోదీకి పోటీగా విపక్షాల ప్రధాని అభ్యర్థి దీదీనే అనే ప్రచారానికి మరింత బలం చేకూర్చుతూ ఇవాళ్టి సభను టీఎంసీ భారీగా నిర్వహించింది. ఖేలా హోబే నినాదాన్ని ఢిల్లీకి తీసుకెళదామన్న మమత మాటలు కూడా ఆమె భవిష్యత్ కార్యాచరణను ప్రతిబింబించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications