సీబీఐకి అప్పగించండి: బీజేపీ ఎమ్మెల్యే రేప్ కేసుపై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: బీజేపీ ఎమ్మెల్యే గ్యాంగ్ రేప్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యోగి సర్కారును తీవ్ర ఇరకాటంలో పడేసే దిశగా పరిణామాలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్యాంగ్ రేప్తో పాటు, బాధితురాలి తండ్రి కస్టడీ డెత్పై విచారణ చేయాలని ధర్మాసనాన్ని కోరారు.
Recommended Video
మనోహర్ లాల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాధితురాలి తండ్రిని కస్టడీలో హింసించి హత్య చేశారని, దీని వెనకాల ప్రభుత్వ అండదండలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
రేప్ కేసు: బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్, సిట్ విచారణకు ఆదేశం..
నిందితులపై కిడ్నాప్తో పాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేయాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో ఎక్కడా బీజేపీ ఎమ్మెల్యే పేరును పేర్కొనలేదని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ఆయనపై కేసులు నమోదు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
పోలీసుల విచారణలో పారదర్శకత కరువైందని, కాబట్టి విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. యువతిపై అత్యాచారం కేసులో ఉనావ్ జిల్లా బంగార్మవ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కుల్దీప్ సింగే ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు.
ఏప్రిల్ 3వ తేదీన, ఎమ్మెల్యే అనుచరులు బాధితురాలి తండ్రిపై దాడి చేసి హింసించారని ఆరోపించారు. అత్యాచారం చేయడమే కాకుండా.. తిరిగి వారే దాడికి పాల్పడ్డ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. న్యాయం కోసం బాధితురాలు సైతం సీఎం ఇంటి ముందు ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని గుర్తుచేశారు.
నిర్భయ గ్యాంగ్ రేప్&ప్రొటెక్షన్ ప్రకారం బాధితురాలి తండ్రికి నష్టపరిహారం కూడా చెల్లించాలని న్యాయవాది కోర్టును డిమాండ్ చేశారు.