విజయ్ సర్కార్ పడగొట్టేందుకు విఫలయత్నం ? ఎమ్మెల్యేకు 35 కోట్లు.. ! అరెస్టులు.!
తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్ని వెనక్కి నెట్టి విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వాన్ని (TVK Govt) నడుపుతున్నారు. అయితే విజయ్ పార్టీ టీవీకేకు మెజార్టీ లేకపోవడంతో, దీన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితుల్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో విజయ్ నడుపుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకల్ని వాడుకుంటూ, స్వయంగా టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేలా విపక్ష డీఎంకేకు చెందిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ తో కలిసి ఈ కుట్ర చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో 15 మంది ఎమ్మెల్యేలను డబ్బులు ఎరచూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు పక్కా నిఘా సమాచారంతో తాజాగా అరెస్టు చేశారు.

వీరిని విచారిస్తే డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు ఆయన సోదరుడి పేరు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానం సమర్పించడం ద్వారా బలపరీక్ష పెట్టించి అందులో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ కుట్రను నిఘా సమాచారం ద్వారా తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుల్ని ట్రేస్ చేయడమే కాకుండా అరెస్టు చేసి జైలుకు కూడా తరలించినట్లు సమాచారం. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఈ వ్యవహారం కనిపిస్తోంది. దీంతో డీఎంకేపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. అయితే డీఎంకే నేతలు మాత్రం ఇది విజయ్ పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు.
విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్రపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీవీకే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల లోపే ఈ కుట్రను భగ్నం చేసినట్లు రాష్ట్ర నిఘా విభాగం పేర్కొంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో 15 మంది తమిళగ వెట్రి కళగం (TVK) ఎమ్మెల్యేలతో ఏకకాలంలో రాజీనామా చేయించడం ఈ కుట్రలో భాగం. ఉతంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్.ఇలయరాజా ఫిర్యాదు తర్వాత దర్యాప్తు ప్రారంభమైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు చెన్నైలోని ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని అరెస్టు చేయగా, కరూర్ నుండి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్రలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
దర్యాప్తు సమయంలో, అరెస్టు అయిన వారిలో కొందరికి, డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి మధ్య ఉన్న సంబంధాలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఆయనపై ఇంకా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు. ఫిర్యాదు ప్రకారం, సీనియర్ టీవీకే నాయకుడైన తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి ఐపీడీఎస్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి తనకు రూ.35 కోట్లు ఆఫర్ చేశారని ఎలయరాజా ఆరోపించారు. ఆ తర్వాత ఈ ఆఫర్ గురించి ఎవరికీ వెల్లడించవద్దని తనను బెదిరించి, హెచ్చరించారని కూడా ఆ ఎమ్మెల్యే ఆరోపించారు.














Click it and Unblock the Notifications