కిసాన్ సమ్మాన్ : ఇచ్చేది మూరెడు.. చెప్పేది బారెడు.. అసలు అర్హులెవరు?
ఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఎవరు అర్హులు? మార్గదర్శకాల ముసాయిదాలో కేంద్రం ఏం చెప్పింది? ఇలాంటి ప్రశ్నలకు ఇచ్చేది మూరెడు.. చెప్పేది బారెడు అనే రీతిలో సమాధానాలు దొరుకుతాయి. ఇచ్చే అరకొర సాయానికి సవాలక్ష ఆంక్షలా అనే వాదనలు లేకపోలేదు. అయితే పథకం సజావుగా, సాఫీగా సాగాలంటే కొన్ని నిబంధనలు తప్పవనేది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది.

నోడల్ వ్యవస్థ
దేశవ్యాప్తంగా 5 ఎకరాల లోపు రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఏటా 6 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది కేంద్రం. ఆ మేరకు కసరత్తు చేస్తున్న అధికారులు స్పీడ్ పెంచారు. అసలు ఆ పథకం కింద ఎవరు అర్హులు, అనర్హులెవరు తెలిపే మార్గదర్శకాల ముసాయిదా రిలీజ్ చేసింది. పథకం అమలు తీరు పర్యవేక్షించడానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేయనుంది. అలాగే మానిటర్ చేయడానికి వీలుగా సెంట్రల్ లెవెల్లో ప్రాజెక్టు మానిటర్ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ పథకానికి సంబంధించి ప్రచారం చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ విభాగం పనిచేయనుంది.
పీఎం కిసాన్ పథకం అమలు కోసం రాష్ట్ర స్థాయిలో నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయనుంది కేంద్రం. ఒక ప్రభుత్వ శాఖకు పీఎం కిసాన్ పథకం అమలు బాధ్యత అప్పగించాలనేది కేంద్రం యోచనగా కనిపిస్తోంది. అదలావుంటే ఏ బ్యాంకు ద్వారా డబ్బును లబ్ధిదారులకు అందించాలో రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేయాల్సి ఉంటుంది.

కిసాన్ సాయం వీళ్లకు లేనట్లే..!
పీఎం కిసాన్ పథకం కింద రూపొందించిన మార్గదర్శకాలు ఒకసారి చూసినట్లయితే.. ఉన్నతాదాయ వర్గాల వారు అర్హులు కారు. వారికి ఈ పథకం వర్తించదు. అలాగే
వివిధ సంస్థల కింద ఐదెకరాల లోపు భూమి ఉన్న వారు కూడా అనర్హులు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న రైతు కుటుంబీకులు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు (తాజా అయినా, మాజీ అయినా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, ఛైర్మన్లు), ప్రభుత్వ ఉద్యోగులు (రిటైర్డ్ & ఆన్ డ్యూటీ), స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కాదు. అయితే 4వ తరగతి గ్రేడ్ ఉద్యోగులను మాత్రం అర్హులుగా ప్రకటించింది కేంద్రం. ఇక పోయినేడాది ఐటీ చెల్లించినవారు, 10వేల రూపాయలకు మించి పింఛను తీసుకునే ఉద్యోగులను అనర్హులుగా ప్రకటించింది. వృత్తినిపుణులైన లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, అర్కిటెక్టులు, సీఎలు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి వీలు లేదు.

సొంత డిక్లరేషన్ కీలకం.. 25 వరకు ఛాన్స్
పీఎం కిసాన్ సమ్మన్ యోజన కింద లబ్ధిదారులు ఇచ్చే సొంత డిక్లరేషన్ కీలకంగా మారనుంది. 5 ఎకరాల లోపు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటే సొంత ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో అది తప్పుడు సమాచారమని తెలిస్తే.. అప్పటివరకు ఇచ్చిన ఆర్థిక సాయం వాపస్ తీసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అధికారులు. పేరు, వయస్సు, కమ్యూనిటీ, గ్రామం, ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలు నమోదు చేయించాల్సి ఉంటుంది. జిల్లాల స్థాయిలో పీఎంకేఎస్వై పోర్టల్కు లాగిన్ అవకాశం కల్పించనున్నారు. అందులో లబ్ధిదారుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.
లబ్ధిదారుల జాబాతా గ్రామస్థాయిల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటోంది కేంద్రం. ఒకవేళ అర్హులైనప్పటికీ తమ పేర్లు జాబితాలో లేకుంటే.. అధికారులకు తెలపాలని సూచించింది. ఈనెల 25వ తేదీ వరకు అర్హులైన చిన్న, సన్నకారు రైతుల జాబితాను పీఎం కిసాన్ వెబ్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని కోరింది. అయితే మొదటి విడత సొమ్ము.. ఏడాదికాలంగా ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు కల్పించింది.












Click it and Unblock the Notifications