మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!
గురునానక్ జయంతి నాడు ప్రధాని మోదీ కలక ప్రకటన చేసారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇప్పటి వరకు వివాదాస్పదంగా మారిన కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. సంవత్సర కాలంగా రైతులు ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు గురునానక్ జయంతి నాడు ప్రధాని కీలక నిర్ణయం ప్రకటించారు. ఆందోళన చేస్తున్న రైతులు తమ నిరసనను విరమించుకోవాలని ప్రధాని కోరారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల రద్దు పైన తీర్మానం చేస్తామని ప్రకటించారు. గురునానక్ జయంతి నాడు ఇళ్లకు చేరాలని సూచించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకు గురు నానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.
Recommended Video
ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రైతు అంశాల పైన ప్రధానంగా ప్రస్తావించారు. రైతుల కష్టాలు దగ్గరి నుంచి చూసానన్నారు. దేశంలో 80 శాతం చిన్న తరహా రైతులే ఉన్నారని..వారి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచామన్నారు. మైక్రో ఇరిగేషన్ ను నిధులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రైతు బడ్జెట్ ను సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచి..వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నామని ప్రధాని వివరించారు.

చిన్న..సన్న కారు రైతులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. వారికి విత్తనాలు..భీమా...మార్కెటింగ్ సదుపాయంతో పాటుగా ఆర్దికంగా వారికి ప్రయోజనం ఉండేలా నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు యూరియా.. భూ పరీక్షల కార్డులు.. మైక్రో ఇరిగేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. కనీస మద్దతు ధరపైన మాత్రమే కాకుండా.. ప్రొక్యూర్ మెంట్ పైన దశాబ్దాల కాలంగా జరగని విధంగా చేసామని ప్రధాని వెల్లడించారు.
తాము రైతు సంక్షేమం కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెబుతూనే... తాము, రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకుని తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నామని స్పష్టం చేసారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కంటే అయిదు రెట్లు వ్యవసాయ బడ్జెట్ ను తీసుకొచ్చామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఇంత కాలం రైతులను ఇబ్బంది పెట్టినందుకు ప్రధాని విచారం వ్యక్తం చేసారు. ప్రధాని చేసిన సంచలన ప్రకటనతో ఏడాదికి పైగా సాగుతున్న రైతుల ఆందోళన ముగియనుంది. ఈ నెలాఖరులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ మూడు చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రధాని వెల్లడించారు.
ఇన్నాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టినందుకు భేషరతుగా క్షమాపణలు తెలిపిన ప్రధాని మోడీ వారిని ఇక, ఈ ఆందోళన ముగించాలని కోరారు. ఇళ్లకు దూరంగా ఉంటూ ఆందోళన చేస్తున్న వారంతా తమ నివాసాలకు వెళ్లి ఈ పర్వ దినాన కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని సూచించారు. భవిష్యత్లో ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. తమది పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రధాని స్పష్టం చేసారు. తన ఏడున్నారేళ్ల కాలంలో రైతుల కోసం తీసుకున్న చర్యలను ప్రధాని వివరించారు.












Click it and Unblock the Notifications