Jammu Kashmir : నేడే ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం-అందరి దృష్టి అటు వైపే...
జమ్మూకశ్మీర్లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం(జూన్ 24) జరగనున్న సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఈ సమావేశానికి జమ్మూకశ్మీర్లోని వివిధ పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరుకానున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ,ఫరూఖ్ అబ్దుల్లా,గుప్కార్ కూటమిలోని పలు పార్టీలకు చెందిన నేతలు,కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ తదితరులు ఉన్నారు.
అగస్టు 5,2019న జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని సమావేశం అవుతుండటం ఇదే తొలిసారి. జమ్మూకశ్మీర్లో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరదించి... అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అంశంపై తాజా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో జమ్మూకశ్మీర్కు ప్రస్తుతం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం హోదాను రద్దు చేసి తిరిగి రాష్ట్ర హోదాను కట్టబెట్టే అంశంపై చర్చించవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా చర్చకు రావొచ్చునని తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల నేతలను ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితమే వారంతా నిర్బంధం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించి... ఎన్నికల నిర్వహణపై ప్రధాని మోదీ వారి అభిప్రాయాన్ని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జమ్మూకశ్మీర్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు.
గతేడాది జరిగిన డీడీసీ ఎన్నికల్లో గుప్కార్ కూటమి విజయం సాధించింది. 110 స్థానాల్లో ఆ కూటమి విజయం సాధించగా 75 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. జమ్మూకశ్మీర్ అస్తిత్వం, స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాను కాపాడుకోవాలన్న లక్ష్యంతో గతేడాది అగస్టులో ఈ కూటమి పురుడు పోసుకుంది. ప్రధాన పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్తోపాటు సీపీఐ-ఎం, పీపుల్స్ కాన్ఫరెన్స్, ఆవామీ నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, పీపుల్స్ మూవ్మెంట్ పార్టీలతో ఈ కూటమి ఏర్పడింది. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న అఖిల పక్ష సమావేశానికి గుప్కార్ కూటమి కూడా హాజరుకానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్ నేతల ముందు ఏ ప్రతిపాదనలు పెట్టబోతున్నారు... వాటికి వారి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుందన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.