ఎవరి మాట వినని అసమర్థుడు: మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శనివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు, నిరుద్యోగం తదితర అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మాటలు వినని అసమర్థ వ్యక్తి ప్రధాని అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఈ మేరకు తన ఫేస్బుక్ అకౌంట్లో వరుస ట్వీట్లు చేశారు.
దేశంలోని నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం ఎన్డీయే హయాంలో పెరిగిందని ధ్వజమెత్తారు. జీఎస్టీ అమలు తీరు అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాలో వచ్చిన పోస్టులు పెట్టారు. రక్షణ మంత్రి శుక్రవారం నాడు రెండు గంటల పాటు రాఫెల్ డీల్ అంశంపై మాట్లాడరని, కానీ తమ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు.
శనివారం రోజే, అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలపై నిప్పులు చెరిగారు. ఆయన జార్ఖండ్,క ఒడిశా ర్యాలీలలో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు. వారిని ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు మాత్రమే అన్నారు. కానీ వారికి చేసిందేమీ లేదన్నారు. యూపీఏ హయాంలో వారికి చేసిందేమీ లేదన్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని, మోడీ మాత్రం నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్తో నష్టం చేశారన్నారు. ఎవరి వ్యాఖ్యలు వినని ఇన్ కంప్లీట్ వ్యక్తి మోడీ అన్నారు. ఎన్డీయే హయాంలో రైతులు ఎంతో నష్టపోయారన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని రైతు రుణమాఫీపై మోడీ విమర్శలు చేస్తున్నారని, కానీ గుజరాత్ రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అక్కడి రైతులు నష్టాల్లో ఉన్నారన్నారు. భావ్ నగర్లో రైతులు నిరసన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మరో పోస్టులో నిరుద్యోగం అంశాన్ని ప్రస్తావించారు.
తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఉంటాయని మోడీ చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా మళ్లీ అదే పాట పాడుతున్నారన్నారు. 2018లో ఒక కోటి పది లక్షల ఉద్యోగాలు పోయాయన్నారు. అనిల్ అంబానీ దొంగతనానికి పని చేయడానికి బదులు దేశం కోసం మోడీ పని చేయాలన్నారు. అప్పుడు దేశంలోని యువత భవిష్యత్తు బాగుంటుందన్నారు.