యువత, మహిళలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్: ఓటు వేయాలని ట్వీట్
పశ్చిమ బెంగాల్లో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సారి కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేతలు కోరుతున్నారు. మీ ఆమూల్యమైన ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. ఉదయం 7 గంటలకు 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టిసారించారు.
వయోజనులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అధికసంఖ్యలో వచ్చి ఓటు వేయాలని సూచించారు. ఇలా ఉంటే బెంగాల్లో కరోనా వైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ.. ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. హౌరా జిల్లాలో 9, దక్షిణ 24 పరగణలో 11, అలిపూర్దుర్లో 5, కూచ్ బెహర్లో 9, హుగ్లీలో 10 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
నాలుగో విడత ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ల వద్ద జనాలు బారులుతీరారు. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ సారి 1.15 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 373 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయో, రాష్ట్ర మంత్రులు పార్థ ఛటర్జీ, అరుప్ బిశ్వాస్ బరిలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 789 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ను రంగంలోకి దింపారు. 15 వేల 940 పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత కొనసాగుతోంది.