BRICS Summit: పాశ్చాత్యదేశాలకు మోడీ క్లారిటీ..! బ్రిక్స్ వ్యతిరేకతకు దూరంగా..!
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ దేశాల సదస్సు (BRICS summit)పై పాశ్చాత్య దేశాలు గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాలు అమెరికా డాలర్ కు వ్యతిరేకంగా ఏకం కావాలంటూ పిలుపులు ఇవ్వడం, పాశ్చాత్య దేశాలకు పోటీగా ఎదిగే అంశాలపై చర్చిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో పాశ్చాత్యదేశాల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని మోడీ (PM Modi) ఇవాళ తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని పాశ్చాత్య దేశాలకు తేల్చిచెప్పేశారు.
భారత్ చేపట్టిన బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ప్రజలే కేంద్రంగా, మానవాళికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చే విధానంపై ఆధారపడి ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు. దృఢత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత తమ ప్రాధాన్యతలుగా ఉన్నాయన్నారు. ఈ ప్రాధాన్యతలతో పాటు, బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను సామాన్య ప్రజలతో అనుసంధానించడంపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు ఒకరి దృక్పథాలను మరొకటి గౌరవిస్తాయని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతాయని వెల్లడించారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, అందరినీ కలుపుకొని వెళ్లడానికే ప్రయత్నిస్తామనని ప్రధానీ మోడీ పేర్కొన్నారు.

రాబోయే 20 ఏళ్లలో అధికారం, విశేషాధికారాల పిరమిడ్ ను భాగస్వామ్య వేదికగా మార్చాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రపంచ పాలనా విధానంలో సంస్కరణలు చేపట్టాలని మోడీ పిలుపునిచ్చారు.అలాగే బ్రిక్స్ తీసుకునే నిర్ణయాలు, వాటి అమలు తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారు. ఈ కూటమి యొక్క సంస్థాగత పురోగతి ఆగిపోకూడదని పేర్కొన్న మోడీ.. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహం) క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో మరింత సహకారం అవసరమని బ్రిక్స్ దేశాలకు గుర్తుచేశారు.














Click it and Unblock the Notifications
