'అసలేంటి మీ సమస్య.. అప్పుడు ఏ నిరసన లేదు.. ఇవి రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన చట్టాలు కాదు...'
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చినవి కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ నిపుణులు,శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చల తర్వాతే చట్టాలను రూపొందించామని అన్నారు. మేనిఫెస్టోల్లో హామీలిచ్చి వాటిని నెరవేర్చనివాళ్లను రైతులు మొదట నిలదీయాలని అన్నారు. 'రాజకీయ పార్టీలకు నేనొక్కటే చెప్పదలుచుకున్నాను... అవపరమైతే వ్యవసాయ చట్టాల క్రెడిట్ అంతా వాళ్ళనే తీసుకోమని కోరుతున్నా. కానీ ఈ విషయంలో రైతులను తప్పుదోవ పట్టించకండి.' అని మోదీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం(డిసెంబర్ 18) మధ్యప్రదేశ్లో నిర్వహించిన కిసాన్ సమ్మేళన్లో ప్రధాని మోదీ మాట్లాడారు.
అసలు మీ సమస్యేంటి.. : మోదీ
'అసలు మీ సమస్యేంటి అని మేము రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నాం. కానీ వాళ్లు మాతో చర్చించేందుకు సిద్దంగా లేరు. క్షేత్రస్థాయిలో రాజకీయ ఉనికిని కోల్పోయినవాళ్లు ఇప్పుడు రైతుల్లో లేనిపోని భయాందోళనలు రేకెత్తించడం ద్వారా తిరిగి రాజకీయంగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయ పార్టీల అసలు స్వరూపాన్ని నేనివాళ బయటపెట్టబోతున్నాను. ఇవే రాజకీయ పార్టీలు 8 ఏళ్ల పాటు స్వామినాథన్ సిఫారసులను అమలుచేయలేదు.' అని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడెందుకు నిరసనలు జరగలేదు...
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినవాళ్లు... గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు లేదా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు రైతుల కోసం ఏమి చేశారని మోదీ ప్రశ్నించారు. ఆ విషయాలను దేశం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.మధ్యప్రదేశ్లో అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని రెండేళ్ల క్రితం హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం... ఎందుకని ఆ హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అయినా అప్పుడెలాంటి నిరసనలు జరగలేదన్నారు.రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. 8 ఏళ్ల పాటు స్వామినాథన్ కమిటీ సిఫారసులను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయలేదని.. ఎందుకంటే వారికి రైతులపై ఖర్చు పెట్టే ఉద్దేశం లేదని అన్నారు.
కనీస మద్దతు ధర కొనసాగుతుంది : మోదీ
ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చినవి కాదన్నారు. గత 20-30 ఏళ్లుగా కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య జరుగుతూ వచ్చిన చర్చలు... వ్యవసాయ నిపుణులు,ఆర్థికవేత్తలు,ప్రగతిశీల రైతుల డిమాండ్ల మేరకే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చామన్నారు.కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రజలు,రైతులు నమ్మకం ఉంచాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇవి కేంద్రం రైతుల కోసం సదుద్దేశంతో తీసుకొచ్చిన చట్టాలని... కనీస మద్దతు ధర తప్పనిసరిగా కొనసాగుతుందని... దాన్ని తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కనీస మద్దతు ధరనే తొలగించాలనుకుంటే... స్వామినాథన్ సిఫారసులను తాము ఎందుకు అమలుచేస్తామని ప్రశ్నించారు. బిహార్,జార్ఖండ్,గోరఖ్పూర్లలో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ ఏర్పాటవుతున్నాయని... వాటి ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.