మీదే ఆ ఘనత: మోడీకి సియోల్ శాంతి పుస్కారం, భారత ప్రధానిపై ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి 2018 సియోల్ శాంతి పురస్కారం లభించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మోడీనామిక్స్ ద్వారా దేశం ఆర్థిక వృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు దక్షిణకొరియా వెల్లడించింది.
మోడీ సేవలను గుర్తిస్తూ..
అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక పురోగతికి మోడీ చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇరుదేశాలకు అనుకూలమైన సమయం చూసి ఈ పురస్కారాన్ని మోడీకి ఇవ్వనున్నట్లు తెలిపింది.
అందుకే మోడీకి ఈ పురస్కారం
‘భారత్లో ఆర్థిక పురోగతి, ప్రపంచ శాంతి, మానవాళి అభివృద్ధికి మోడీ విశేష సేవలు అందిస్తున్నారు. అందుకే ఆయన్ను అత్యంత గౌరవమైన సియోల్ శాంతి బహుమతికి ఎంపిక చేశాం' అని సియోల్ శాంతి పురస్కారం అవార్డు కమిటీ చెప్పినట్లు విదేశాంగశాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
మోడీపై ప్రశంసలు
ఈ సందర్భంగా మోడీ భారత్లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలపై ప్రశంసలు కురిపించింది. అలాగే మేకిన్ ఇండియాతో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో విజయవంతం అయ్యారని అభినందించింది. మోడీనామిక్స్ ద్వారా ధనిక, పేద ప్రజల మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక అసమానతలు తొలిగేలా కృషి చేస్తున్న ఘనత మోడీదేనని కొనియాడింది.
సాహసోపేతమైన నిర్ణయాలు
అవినీతిని కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దుపై కూడా అవార్డు కమిటీ ప్రశంసల జల్లు కురిపించింది. నోట్ల రద్దు.. మోడీ తీసుకున్న సాహసోపేతమైన గొప్ప నిర్ణయమని పేర్కొంది. రెండేళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. గతంలో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ తదితరులకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మోడీ ఈ అవార్డు అందుకుంటున్న 14వ వ్యక్తి. ఈ అవార్డుతోపాటు 2లక్షల యూఎస్ డాలర్స్ను అందించనున్నారు.