మోదీ కొత్త కేబినెట్ తొలి భేటీ -సాయంత్రం 5 గంటలకు -కీలక నిర్ణయాలు, విశేషాలివే..
భారీ పునర్వ్యవస్థీకరణ తర్వాత కేంద్ర కేబినెట్ తొలిసారి భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నూతన కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. భారీ అంచనాల నడుమ జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తాజాగా కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చోటుచేసుకోవడం, కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడం, అందులో 15మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా నియమితులు కావడం తెలిసిందే. కీలక శాఖలకు చెందిన 12 మంది మంత్రులు రాజీనామాలు చేయగా, వారి స్థానంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు సైతం పూర్తయ్యాయి.
కొత్త మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కలిసి పనిచేయడం ద్వారా బలమైన, సంపన్న భారత నిర్మాణానికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. తాజా మార్పులతో మోదీ కేబినెట్లో మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
మోదీ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కిన వారిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, 11 మంది మహిళలు ఉన్నారు. 19 మంది మాజీ రాష్ట్ర మంత్రులు, 39 మంది మాజీ ఎమ్మెల్యేలు, రెండు లేదా మూడు సార్లు నెగ్గిన 23 మంది ఎంపీలు ఉన్నారు. వృత్తిపరంగా 13 మంది డాక్టర్లు, ఐదుగురు ఇంజనీర్లు, ఏడుగురు సివిల్ సర్వెంట్లు ఉన్నాయి.
Recommended Video
మోదీ కొత్త కేబినెట్ లో14 మంది మంత్రులు 50 ఏళ్లు లోపువారు కావడం విశేషం. దీంతో కేబినెట్ సగటు వయస్సు (యావరేజ్ ఏజ్) 58కి తగ్గింది. సామాజికవర్గ కోణంలో చూసినప్పుడు ముస్లిం, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్ మతాలకు చెందిన ఒక్కో మంత్రి ఉండగా, 27 మంది ఓబీసీ వర్గానికి, 8 మంది ఎస్టీ వర్గానికి, 12 మంది ఎస్సీ వర్గానికి చెందిన వారున్నారు.