ఒమిక్రాన్ కేసుల కలకలం: కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా, మహాారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నమోదైన కేసులతో 300 దాటాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్, కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్షించారు.
కేంద్ర హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతోపాటు పలువురు నిపుణులు హాజరైన ఈ సమావేశంలో ఒమిక్రాన్ తోపాటు కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని చర్చించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ లాంటి వసతులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ వేగం పెంచాలన్నారు.కాగా, ఈ ఒక్కరోజే తమిళనాడులు అత్యధికంగా 33 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా, మహారాష్ట్రలో 23 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ బారినపడినవారిలో 104 మంది కోలుకున్నట్లు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి అప్రమత్తం చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. పరిస్థితి ప్రమాదంలో పడకముందే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆంక్షలు కనీసం 14 రోజులు అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది.
Recommended Video
ఇక క్రిస్మర్, న్యూఇయర్, సంక్రాంతి పండగల సమయాల్లో రాత్రిపూట కర్ఫ్యూలను అమలు చేయడంపాటు భారీ సభలు, జన సమూహాల్ని నియంత్రించాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, దేశంలో 60శాతం మందికిపైగా అర్హులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావడం గమనార్హం.