షాకింగ్: ప్రధాని మోదీ కన్నీరు -కొవిడ్ మరణాలపై భావోద్వేగం -మహమ్మారితో పోరు సుదీర్ఘం -వారణాసికి వందనం
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండం కొనసాగుతూ, ఏరోజూ 4వేలకు తక్కువ కాకుండా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్, వ్యాక్సిన్ల కొరత ఎప్పటికి తీరుతుందో తెలీని అయోమయ స్థితిలోనే మూడో వేవ్ వెల్లువెత్తొచ్చన్న హెచ్చరికలు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా పరిస్థితుల నిర్వహణలో అతి దారుణంగా విఫలం చెందారని భారత ప్రధాని నరేంద్ర మోదీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణంలో.. దేశంలో కొవిడ్ మారణ మారణహోమంపై మోదీ కన్నీరు పెట్టారు. కరోనాతో పోరు సుదీర్ఘకాలం సాగబోతోందనే సంకేతమిచ్చారు..

వారణాసి వారియర్లతో..
సొంత నియోజకవర్గం వారణాసిలో కొవిడ్ పరిస్థితులపై శుక్రవారం సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ, అక్కడి వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్లతో వర్చువల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా మిగిల్చిన విషాదాన్ని తల్చుకుంటూ మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కొవిడ్ మహమ్మారికి ఎంతో మంది బలైపోయారంటూ ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు. ''నిన్నమొన్నటి వరకు మనతోనే, మన చుట్టూ ఉన్న ఎంతో మంది ప్రియతమ వ్యక్తులను ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అయితే, ఇంతటి విలయంలోనూ ధైర్యసాహసాలతో పోరాడుతోన్న వైద్య సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు'' అని ప్రధాని మోదీ అన్నారు.

కొవిడ్ విలయం ఇప్పట్లో ముగియదు..
జులై నాటికి కరోనా రెండో దశ విలయం ముగుస్తుందన్న రిపోర్టులు, మళ్లీ నాలుగు నుంచి ఆరు నెలల వ్యవధిలో మూడో వేవ్ తలెత్తొచ్చన్న అంచనాల నేపథ్యంలో మహమ్మారిపై పోరాటం సుదీర్ఘకాలం సాగబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ''రెండో దశ వ్యాప్తిని నియంత్రించడానికి మనందరం తీవ్రంగానే శ్రమించాం. అయితే, ఇంతటితో విశ్రాంతి కుదరదు. ఇంకా సుదీర్ఘంగా పోరాటంచేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో గ్రామాలవైపు మన దృష్టిని మరల్చాలి. ఏది జరిగినా సమిష్టి బాధ్యత అన్న సంగతిని ప్రజలు మరువరాదు. ఆ కాశీ విశ్వనాథుని దయతో సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియ కచ్చితంగా సత్ఫలితాలనిస్తుంది'' అని ప్రధాని చెప్పారు. అలాగే,

మరో సవాలు.. మోదీ సన్నద్దత..
వారణాసి వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లతో మాట్లాడిన ప్రధాని మోదీ కొవిడ్ విలయానికి తోడు మరో సవాలుగా దాపురించిన బ్లాక్ ఫంగస్ పైనా హెచ్చరికలు చేశారు. బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, కరోనాలాగే ఫంగస్ ను కూడా సమర్ధంగా ఎదుర్కొందామని ప్రధాని పిలుపునిచ్చారు. వారణాసిలో తక్కువ సమయంలోనే ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకలను పెద్ద సంఖ్యలో విస్తరించారంటూ అధికారులను ఆయన ప్రశంసించారు. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే కరోనాకు 4,209 మంది బలయ్యారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 2,91,331మంది కొవిడ్ వల్ల చనిపోయారు. కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో ఫెయిల్ అయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే ప్రధాని మోదీ కన్నీరు పెట్టడం గమనార్హం.












Click it and Unblock the Notifications