మోదీ నన్ను శూర్పణఖ అని అన్నాడు: రేణుకా చౌదరి..!!
అహ్మదాబాద్: రెండో విడత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఇదివరకే తొలి విడత ప్రచార కార్యక్రమాలకు పుల్ స్టాప్ పడింది. డిసెంబర్ 5వ తేదీన జరుగనున్న రెండో విడతపై దృష్టి సారించాయి రాజకీయ పార్టీలన్నీ. ప్రచార ఉధృతిని పెంచాయి. ఘాటు వ్యాఖ్యలతో పరస్పరం విరుచుకుపడుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేయడానికీ వెనుకాడట్లేదు.
వ్యక్తిగత విమర్శలకూ..
ఈ సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాలకు కేంద్రబిందువు అయ్యాయి. దీనిపై భారతీయ జనత పార్టీ నాయకులు ఎదురుదాడి సాగిస్తోన్నారు. కాంగ్రెస్ను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రచారాస్త్రాలుగా మలచుకున్నారు బీజేపీ నాయకులు. దీనికి అటు మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రావణుడిలా వంద తలలు
ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు మల్లికార్జున ఖర్గే. రావణుడిలా మోదీకి వంద తలలు ఏమైనా ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. తన ముఖం చూసి బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రతి ఎన్నికలోనూ మోదీ ప్రజలను అభ్యర్థిస్తుంటారని ఎద్దేవా చేశారు. మోదీని చూసి ఎలా ఓటు వేస్తారని ఖర్గే ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయకపోయినా ఆయనను చూసే ఓటు వేయాలా? అని నిలదీశారు. మోదీని చూసి ఓటు వేయొద్దని, అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలని సూచించారు.

పరిష్కరించేది స్థానిక ప్రభుత్వమే..
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఏ అవసరం వచ్చినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వమే పరిష్కరిస్తుందని మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. సానుభూతి కోసం ప్రధాని ప్రతిరోజూ తాను పేదవాడినని చెప్పుకొని తిరుగుతున్నారని, నిజమైన పేదవాడెవడూ అలా చెప్పుకోడని అన్నారు. మోదీని రావణుడితో పోల్చడాన్ని వివాదంగా మార్చారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగారు. గుజరాతీయులను అవమానించారని ఆరోపిస్తోన్నారు.

నన్ను శూర్పణఖతో పోల్చలేదా?
ఈ నేపథ్యంలో- తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరి రంగంలోకి దిగారు. గతంలో పార్లమెంట్లో ప్రధాని తనను శూర్పణఖతో పోల్చారని గుర్తు చేశారు. అప్పుడు ఈ మీడియా ఏమైందని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారామె. 2018 నాటి ఉదంతం ఇది.
జైరామ్ రమేష్ రిప్లై..
దీన్ని ఇప్పుడు తెరమీదికి తెచ్చారు రేణుక చౌదరి. దీనికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేష్- రిప్లై ఇచ్చారు. అప్పుడు సభలో ప్రధాని మోదీ నవ్వుతూ రేణుకా చౌదరిని కించపరిచారని చెప్పారు. 2018లో రాజ్యసభలో చర్చల సందర్భంగా మోదీ రేణుకా చౌదరి ఓ మహిళ అని కూడా చూడకుండా శూర్పణఖతో పోల్చారని గుర్తు చేశారు. తాను అప్పుడు సభలోనే ఉన్నానని అన్నారు.












Click it and Unblock the Notifications