భారత్ పై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్..!!
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్.
తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది. ఈ టారిఫ్ అనంతరం అంతర్జాతీయ కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. చైనా, రష్యాలతో దోస్తీని పెంపొందించుకుంది భారత్. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగుపెట్టారు. ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో సమావేశం అయ్యారు. ఫలితంగా భారత్- అమెరికా సంబంధాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. భారత్ సంబంధాలు మరింత బలహీనపడొచ్చని భావిస్తోన్న నేపథ్యంలో ఆయన మెత్తపడ్డారు. తాను ఎప్పుడూ మోదీకి స్నేహితుడిగానే ఉంటానని, ఆయన గొప్ప ప్రధానమంత్రి అని ప్రశంసించారు. ఇరు దేశాల సంబంధాలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. భారత్- అమెరికా స్నేహ సంబంధాలు ఈనాటివి కావాని, వాటిని ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు.
వైట్ హౌస్ లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్- అమెరికాల మధ్య ప్రత్యేక సంబంధం ఉందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ను చైనాకు కోల్పోతున్నామని అనుకోవట్లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయని, కొన్ని నెలల కిందటే ఆయన ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మోదీ సానుకూలంగా స్పందించారు. వీటిని స్వాగతిస్తున్నానని అన్నారు. ట్రంప్ అభిప్రాయాలను పూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య సమగ్ర, అంతర్జాతీయ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని వ్యాఖ్యానించారు. సానుకూల భవిష్యత్ కు దిశా నిర్దేశం చేసే విధంగా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఇరుదేశాల బంధం మరింత బలపడటానికి ఇది దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications