మోడీ తీరు మారిందా.. బీజేపీ నేతలకు ఇక దబిడి దిబిడేనా?
Recommended Video
ఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ రూటే సెపరేటు. తాను అనుకున్న రీతిలో ముందుకెళ్లడం ఆయన నైజం. గత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుని దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. అలా ఈసారి 303 స్థానాల్లో బీజేపీ గెలిచిందంటే అది మోడీ ఛరిష్మానే అంటున్నారు కమలనాథులు. అయితే క్యాడర్, లీడర్ ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలనేది మోడీ మార్క్.
ఇటీవల బీజేపీ నేతల తీరు వివాదస్పదమవుతోంది. ఓ అధికారిని పార్టీ ఎమ్మెల్యే బ్యాట్తో కొట్టిన వైనం ఒకచోట.. మందేస్తూ చిందేస్తూ తుపాకులు చేతబట్టిన ఎమ్మెల్యే వైనం ఇంకోచోట వెలుగుచూడటం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఆ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదలావుంటే తాజాగా మోడీ తీసుకున్న మరో నిర్ణయం చర్చానీయాంశమైంది.

అప్పుడేమీ లేదు గానీ.. ఈసారి మాత్రం స్ట్రిక్ట్
ఇటీవల పార్టీ నేతల తీరుపై గుర్రుమంటున్నారు ప్రధాని మోడీ. తొలి ప్రభుత్వంలో అలాంటి చర్యలేవీ కనిపించని మోడీ తీరు సడెన్గా యూ టర్న్ తీసుకున్నట్లు కనిపించడం చర్చానీయాంశమైంది. ఈసారి 303 స్థానాలతో బంపర్ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్టీ పరువు బజారున పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ మేరకు ప్రధాని మోడీ స్వయంగా నేతల పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్న వేళ.. కొందరి నేతల తీరు పార్టీకి నష్టం చేసే విధంగా ఉండొద్దనేది ఆయన అంతరంగమనేది స్పష్టమవుతోంది.

కేంద్రమంత్రులపై గరం.. వాళ్ల పేర్లు ఇవ్వండంటూ..!
ఆ క్రమంలో మంగళవారం నాడు జరిగిన పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని కేంద్రమంత్రులపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే సమావేశాలకు రాలేదో.. వారి పేర్లు తనకు ఇవ్వాలంటూ ఇటు బీజేపీ పార్లమెంటరీ పార్టీని, అటు పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రిని ఆదేశించారు. పార్లమెంట్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కెబినెట్ మంత్రులు కాకుండా సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదలావుంటే తమ శాఖలకు సంబంధించి సభలో చర్చ జరుగుతున్నప్పుడు సదరు మంత్రులు కూడా రాకపోవడంపై మోడీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

అలాంటివారు మనకొద్దు.. మోడీ సీరియస్
ఇటీవల ఇండోర్ ఎమ్మెల్యే ఆకాష్ వర్గియా విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారిపై బ్యాట్తో దాడి చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దాంతో మోడీ సీరియస్ అయ్యారు. తప్పు చేస్తే ఎవరైనా సరే క్షమించేది లేదంటూ అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఆదేశించారు. పార్టీ ఇమేజ్ను డ్యామేజీ చేసే ఇలాంటి నాయకులు మనకు అక్కర్లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆ ఘటనకు ముందు ఆకాష్ వర్గియా జైలు నుంచి వచ్చిన క్రమంలో ఆయనకు స్వాగతం పలికిన నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదలావుంటే ఇటీవల జరిగిన మరో ఇన్సిడెంట్పై కూడా మోడీ గరమయ్యారు. ఉత్తరాఖండ్లోని ఖాన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ తాగుతూ తూలుతూ తుపాకులు చేతబట్టిన తీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అటు మీడియా కూడా హైలైట్ చేయడంతో విషయం కాస్తా మోడీ దృష్టికి వెళ్లింది. దాంతో అతడిని తిరిగి పార్టీలో చేర్చుకోకుండా బహిష్కరించాలని ఆదేశించారు. ప్రణవ్ సింగ్ అప్పటికే మూడు సార్లు పార్టీ నుంచి సస్పెండ్ కావడం గమనార్హం.

మీడియాతో జాగ్రత్త.. వివాదస్పద వ్యాఖ్యలు చేయొద్దు..!
ఇదివరకు ఓసారి పార్టీ నేతలను ఉద్దేశించి మోడీ కీలక సూచనలు చేశారు. మీడియా ఎదుట వివాదస్పద వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. మీరంతట మీరే మీడియాకు మసాలా కావొద్దని సూచించారు. అనవసర విషయాలు జోలికి వెళ్లి వివాదాల్లో ఇరుక్కోవద్దని స్పష్టం చేశారు. మనం చేసే పొరపాట్లే మీడియాకు మసాలాగా దొరుకుతాయని.. కెమెరాలు కనిపించగానే రెచ్చిపోవద్దని కోరారు. అది మీడియా తప్పిదం కాదని.. నూటికి నూరు శాతం మన తప్పేనని వ్యాఖ్యానించారు. వివాదస్పద వ్యాఖ్యలతో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా పార్టీ పరువు బజారున పడుతుందని హితోపదేశం చేశారు. మొత్తానికి దేశమంతా బీజేపీ వైపు చూస్తోందని బలంగా నమ్ముతున్న మోడీ.. ఇలా పార్టీ నేతల పనితీరుపై దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications