"2022నాటికి నవభారత్.. గోరఖ్పూర్ ఘటన బాధాకరం.. జీఎస్టీతో కొత్త చరిత్ర"
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్నిస్వీకరించారు. అంతకుముందు రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి ఆయన నివాళులు అర్పించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడులు వీక్షించేందుకు ప్రముఖులు, పౌరులు ఎర్రకోటకు భారీగా తరలివచ్చారు. వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, కేంద్రమత్రులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
గోరఖ్పూర్ ఘటన బాధాకరం:
దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమర వీరులకు నమస్సులు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరఖ్ పూర్ చిన్నారుల మృతి గురించి ఆయన ప్రస్తావించారు. చిన్నారుల మృతి బాధాకరమని అన్నారు.
దేశవ్యాప్తంగా వరదలతో తీవ్ర నష్టం జరిగింది. వరద బాధితులను ఆదుకుంటామని మోడీ పేర్కొన్నారు. ప్రక్రుతి వైపరిత్యాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నవ భారత నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నవభారత్ నిర్మాణం:
అమరవీరుల స్ఫూర్తితో 2022 నాటికి నవభారత్ ను నిర్మించాలని మోడీ ఆకాంక్షించారు. వేగవంతమైన మార్పులతో దేశాభివృద్ది దిశగా కీలక అడుగులు వేస్తున్నామని చెప్పారు. 9 నెలల్లో శుక్రగ్రహానికి చేరినవాళ్లం.. 70 కి.మీ రైల్వే లైన్ వేయడానికి మాత్రం 42 ఏళ్లు తీసుకున్నామన్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇలాంటి పరిస్థితులు మార్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్రాలకు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించి వేగవంతమైన అభివృద్దికి కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు దేశ ప్రజలు ఎప్పుడూ అండగా నిలబడుతారని, ఆ విషయంలో వెనుకగడుగేయరని అన్నారు.
జీఎస్టీతో కొత్త చరిత్ర:
గ్యాస్ రాయితీ వదిలేయమని పిలుపునిచ్చినా.. నోట్ల రద్దు చేసినా జనం అండగా నిలిచారని అన్నారు. జీఎస్టీతో కొత్త చరిత్ర సృష్టించామని అన్నారు. కొత్త పన్ను విధానానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. రైతుకు సాగునీరు అందిస్తే బంగారం పండిస్తారని, ప్రధాన మంత్రి కృషి యోజన ద్వారా రైతుకు సాగునీరు అందించే కార్యక్రమం వేగవంతం చేస్తున్నాం.
రైతులను ప్రోత్సహించాలి:
విత్తనాల నుంచి మార్కెట్ దాకా రైతుకు వెన్నదన్నుగా నిలిస్తేనే ప్రయోజనం ఉంటుందని, మార్కెట్ వ్యవస్థలో లోపాలను సరి చేసేందుకు నూతన విధానాలను ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఇందులో జాతీయ వ్యవసాయ మార్కెట్ రూపలకల్పన అత్యంత ప్రధానమైనదని గుర్తుచేశారు.
నష్టాల్లో ఉన్న రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించాలన్నారు. యువతకు ఆర్థిక సాయం చేస్తే ఉద్యోగ వెంపర్లాట కన్నా కొత్త ఉద్యోగాలను సృష్టికి వారు ప్రయత్నిస్తారని చెప్పారు.