దేశంలో కరోనా ఉధృతి: ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా, దేశంలో రెండున్నర లక్షల కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం దేశంలో కరోనా వైరస్ పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు ప్రధాని మోడీ. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, టీకా కార్యక్రమం అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తి కావొస్తోందన్నారు. పది రోజుల్లోనే 3 కోట్ల మంది టీనేజర్లకు కోవిడ్ టీకా పూర్తి చేసినట్లు ప్రధాని తెలిపారు. త్వరితగతిన కరోనా టీకా దేశ సామర్థ్యాన్ని తెలుపుతోందన్నారు. రాష్ట్రాల వద్ద పూర్తిస్థాయిలో కోవిడ్ టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కాగా, ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే హాజరుకాకపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయన స్థానంలో మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి హాజరవుతారని తెలిపాయి.
మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,47,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో గత రోజు కంటే 50 వేల కేసులు పెరిగాయి.
గడిచిన ఎనిమిది నెలల కాలంలో తొలి సారిగా భారత్ రెండు లక్షల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాటింది. రాజస్థాన్ లో ఒకే రోజు 10 వేలకు పైగా కరోనా కేసులను గుర్తించారు. ప్రయాగ్ రాజ్ లో 38 మందిని కరోనా పాజిటివ్ బాధితులుగా నిర్దారణ అయింది. దీని ద్వారా దేశంలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 11,17,531 కాగా, పాజిటివిటీ రేటు 13.11 శాతానికి చేరింది. జనవరి నెలాఖరుకు కోవిడ్ కేసుల సంఖ్య పీక్ కు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓమిక్రాన్ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ఫ్లూ ను సాధారణంగా తీసుకోవద్దంటూ హెచ్చరించింది.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 కు చేరింది. కాగా, ఇప్పటికే 2,162 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత ఏడాది మే 26న భారత్ లో 2,11,298 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఇప్పుడు తిరిగి రెండు లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి.