డ్రోన్ ఎగురవేసిన మోదీ- భారత్ మండపం ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో కొత్త కట్టడం అందుబాటులోకి వచ్చింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) కాంప్లెక్స్ ఇవ్వాళ ప్రారంభమైంది. చారిత్రాత్మక ప్రగతి మైదాన్ వద్ద కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ దీన్ని నిర్మించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే ఈ కాంప్లెక్స్ను ప్రారంభించారు.
ఈ కొత్త ఐటీపీఓ కాంప్లెక్స్కు భారత్ మండపంగా నామకరణం చేశారు. ఈ కాంప్లెక్స్కు భారత్ మండపం అనే పేరును వినూత్నంగా ఆవిష్కరించారు. భారత్ మండపం అంటూ హిందీలో రాసిన ఓ ఎరుపురంగు వస్త్రాన్ని మోదీ డ్రోన్ ద్వారా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా మోదీ స్వయంగా ఆ డ్రోన్ను ఎగురవేయడం కనిపించింది.

123 ఎకరాల్లో నిర్మితమైన ఐటీపీఓ కాంప్లెక్స్ ఇది. అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్లు, సమావేశాలు, అత్యున్నత స్థాయి భేటీలు, సదస్సులు, వర్క్షాప్స్, కాన్ఫరెన్సులు, ఎగ్జిబిషన్లను నిర్వహించుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం- ఈ కాంప్లెక్స్ను రూపకల్పన చేసింది. ఇదివరకు ఐటీపీఓ భవనాన్ని పడగొట్టి దాని స్థానంలో కొత్తగా దీన్ని నిర్మించింది.
భారత్ మండపంలో జీ20 సమ్మిట్ను నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సదస్సు ఇక్కడ ఏర్పాటు కానుంది. దీన్ని ప్రారంభించడానికి ఈ సాయంత్రం మోదీ ప్రగతి మైదాన్కు చేరుకున్నారు. కొత్త ఐటీపీఓ కాంప్లెక్స్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

అనంతరం ఈ కాంప్లెక్స్ నిర్మాణంలో పని చేసిన కార్మికులతో మాట్లాడారు. వారిని అభినందించారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? వారికి అందుతోన్న జీతభత్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో మోదీ వెంట కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
#WATCH | PM Narendra Modi inaugurates new ITPO complex 'Bharat Mandapam' in Delhi pic.twitter.com/igBT229O5U
— ANI (@ANI) July 26, 2023
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. భారత్ను అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం అంగీకరిస్తోందని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో నిర్వహించిన విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను క్లుప్తంగా వివరించారు. ఎక్కడికి వెళ్లినా భారతీయులు స్వదేశ గొప్పతనాన్ని చాటుకుంటోన్నారని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలపైనా ఘాటు విమర్శలు చేశారు మోదీ. దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూడేలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాలు భారత్ను అభినందిస్తోంటే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ప్రతి అంశాన్నీ ప్రతిపక్షాలు ప్రతికూల దృక్పథంతో చూస్తోన్నాయంటూ చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications