ట్రంప్ దెబ్బకు బెంబేలు.. కాళ్ల బేరానికి మోడీ ఏం చేస్తున్నారో తెలుసా ?
అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలసదారులతో పాటు పన్నుల విషయంలోనూ ఇతర దేశాలతో ఉరుముతున్నారు. ముఖ్యంగా తాము తక్కువ పన్నులు విధిస్తున్నా తమతో వాణిజ్యం చేస్తున్న దేశాలు భారీగా పన్నుల మోత మోగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. వాటికి కత్తెర వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అమెరికా టూర్ లో ఆయన సమక్షంలోనే పన్నుకు పన్ను హెచ్చరికలు చేశారు.
దీంతో భారత్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడుతోంది. ఇన్నాళ్లూ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై భారీ పన్నులు బాదుతూ డబ్బులు వెనకేసుకున్న భారత్.. ఇప్పుడు అంతే పన్ను మీ వస్తువులపైనా విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో నష్ట నివారణ చర్యలకు దిగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన పరస్పర పన్నుల ప్రభావం ఎదుర్కోవడానికి భారత్ తన వ్యూహంలో భాగంగా దిగుమతి పన్నులను మరింత తగ్గించాలని యోచిస్తోందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముంబైలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన నిరంతర ప్రక్రియలో సుంకం కోతలు , హేతుబద్ధీకరణ భాగమని తేల్చిచెప్పేశారు. పెట్టుబడిదారులకు స్నేహపూర్వక దేశంగా ఉండేందుకు సుంకాల్లో కోతలు, హేతుబద్ధీకరణలు కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చేశారు. దీన్ని బట్టి చూస్తే అమెరికా, భారత్ పన్నులు సమానంగా ఉండే వరకూ ఈ కార్యక్రమం కొనసాగబోతోందని తేలిపోయింది.
భారతదేశం యొక్క 30 అత్యంత ముఖ్యమైన దిగుమతులపై సుంకాలు 3శాతం లోపు ఉన్నాయని, కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులకు మాత్రమే అధిక సుంకాలు వర్తిస్తాయని ఆర్ధిక శాఖ కార్యదర్శి తుహిన్ పాండే తెలిపారు. అమెరికాతో చర్చల సమయంలో ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా, ప్రభుత్వం పెట్టుబడిని ప్రోత్సహించడం, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా వాణిజ్య వివాదాల్ని తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. కాబట్టి అమెరికాతో వాణిజ్య వివాదాలు రాకుండా కేంద్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications