మోడీ యుగపురుషుడు: సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రశంస
గాంధీనగర్: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తారు. ఆయనను యుగపురుషుడిగా అభివర్ణించారు. ఆదివారంనాడు ఆమె గుజరాత్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ మోడీని సర్ధార్ వల్లబ్ బాయ్ పటేల్, గాంధీలతో పోల్చారు.
"ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్, బాపూజీ (మహాత్మా గాంధీ)లకు చెందిన ఈ నేలకు (గుజరాత్) వచ్చాను. ఈ నేలనే మనకు యుగపుడురుషుడు.. మన ప్రధానిని ఇచ్చింది. ఈ నేలకు తల వంచి నమస్కరించడానికి వచ్చాను" అని ఆమె గాంధీనగర్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.
రామాలయం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, వాళ్లు రామాలయం నిర్మిస్తారని, తాము నిర్మించబోమని చెప్పారు. అంతకు మించి ఎక్కువ మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు. సాధ్వి రితంబర సమక్షంలో ప్రారంభమైన భక్తి యోగ వేదాంత సమ్మేళనంలో పాల్గొనడానికి సాధ్వి నిరంజన్ జ్యోతి ఇక్కడికి వచ్చారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్డీఎ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. నిరంజన్ జ్యోతి రాజీనామాకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. ఆమె వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ కూడా తప్పు పట్టారు. దాంతో తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు.