సాయం కోరిన ఆరేళ్ల చిన్నారి వైశాలిని కలిసిన మోడీ
ముంబై: తన సహాయం కోరిన చిన్నారి వైశాలిని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు కలుసుకున్నారు. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, గుండె జబ్బుతో బాధపడుతున్న తనకు సాయం కావాలని ఆరేళ్ల బాలిక వైశాలి కొద్ది రోజుల క్రితం ప్రధానికి లేఖ రాసింది.

పుణెకు చెందిన వైశాలి రెండో తరగతి చదువుతోంది. గుండెలో రంధ్రం సమస్యతో బాధపడుతున్నది. పెయింటర్గా పని చేసే ఆమె తండ్రి ఆపరేషన్ చేయించలేకపోయారు. మందులు కొనడానికి పాప ఆడుకునే బొమ్మల్నీ, సైకిల్నూ అమ్మిన సందర్భాలున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తన గుండెజబ్బుకు చికిత్స చేయించేందుకు తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేవనీ, సహాయం చేయాలంటూ ఆమె ప్రధాని మోడీకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన మోడీ.. ఆమెకు ఆపరేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. వైశాలికి ఆపరేషన్ జరిగింది.

అనంతరం, శనివారం ప్రధాని మోడీ తన పుణె పర్యటనలో.. వైశాలిని, ఆమె తల్లిదండ్రులను కలుసుకున్నారు. వైశాలితో ఆప్యాయంగా ముచ్చటించారు. చిన్నారికి తాము సహాయపడగలిగినందుకు సంతోషంగా ఉందని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. శస్త్రచికిత్స తర్వాత వైశాలి తన గుండెను తట్టే లేఖ రాసిందనీ, అది తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications