చైనాకు దీటుగా బదులిచ్చారు.. అమరుల త్యాగం వృథా కాబోదు: గాయపడ్డ జవాన్లతో ప్రధాని
''కొంత మంది ధైర్యవంతులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కారణం లేకుండా వాళ్లా పనిచేయలేదు. అమరుల త్యాగాలు ఎన్నటికీ వృథా కాబోవు. మీరు కూడా ప్రత్యర్థికి దీటుగా బదులిచ్చారు. మీ ధైర్యసాహసాలే దేశానికి అసలైన ప్రేరణ.. '' అంటూ సైనికుల్లో ఉత్తేజం నింపారు ప్రధాని నరేంద్ర మోదీ. గతనెల 15న తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో గాయపడ్డ జవాన్లను ఆయన పరామర్శించారు.
త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే వెంటరాగా, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లదాక్ లో కీలక పర్యటన చేపట్టారు. ముందుగా నిమూ ప్రాంతానికి వెళ్లి.. ఎల్ఏసీ పరిస్థితిని రివ్యూ చేసిన ఆయన, సైనిక, వాయుసేన, ఐటీబీపీ బృందాలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం లేహ్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతోన్న జవాన్లను కలసుకున్నారు.

ప్రపంచంలో ఏ శక్తి ముందూ భారత్ తలవంచబోదని, సైనిక వీరులు ఉన్నారన్న ధైర్యంతోనే తానీ మాట చెబుతున్నానని మోదీ వ్యాఖ్యానించారు. లేహ్ ఆస్పత్రిలో జవాన్లు చికిత్స పొందుతోన్న వార్డులో కలియదిరుగుతూ, ప్రతి ఒక్కరి దగ్గరికెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారాయన. నాటి ఘర్షణలో స్పల్పంగా గాయపడ్డ కొందరు ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి, మళ్లీ ఫ్రంట్ లైన్ విధుల్లోకి చేరిపోగా, మిగతా వాళ్లు కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

భారత ప్రధాని ఆకస్మికంగా లదాక్ లో పర్యటించడం చైనాకు గుబులు పుట్టించింది. ఓ వైపు సైనిక, దౌత్య పరమైన చర్చలు జరుగుతోంటే, ఉద్రిక్తతలు మరింత పెంచేలా మోదీ పర్యటన ఉందని చైనా విదేశాంగ శాఖ ఆక్షేపించింది. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని 'విస్తరణవాదం'గా అభివర్ణించిన మోదీ... విస్తరణవాదులంతా మట్టికొట్టుకుపోయినట్లు చరిత్ర చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాము విస్తరణవాదులం కాదని, సరిహద్దు సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకే కట్టుబడి ఉన్నామంటూ చైనీ ఎంబసీ ప్రకటన చేసింది.
PM Shri @narendramodi met soldiers injured in the Galwan Valley face-off on June 15 in a hospital in Leh. pic.twitter.com/e2u81aJEQ8
— BJP (@BJP4India) July 3, 2020












Click it and Unblock the Notifications