పరీక్ష నాకు కాదు మీకే- అవిశ్వాసం వేళ విపక్షాల ఐక్యతపై మోడీ సెటైర్లు...
మణిపూర్ ఘటనలపై ప్రధాని మోడీతో సమాధానం చెప్పించే లక్ష్యంతో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగబోతోంది. ఇందులో కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీల ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పాక ప్రధాని మోడీ ఈనెల 10న జవాబు ఇస్తారు. అయితే ఆ అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు ఎలాగో నెగ్గే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ విపక్షాలపై సెటైర్లు మొదలుపెట్టేశారు.
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు విపక్షం సిద్దమవుతున్న వేళ ప్రధాని మోడీ విపక్షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమి ఇండియా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ని కోరుకుంటోందని, ఫలితాలు అందరూ చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. నిన్న రాజ్యసభ ఆమోదించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై జరిగిన రచ్చను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

విపక్ష కూటమిపై విరుచుకుపడిన ప్రధాని మోడీ.. పరస్పర అవిశ్వాసంతో విపక్షం ఇబ్బంది పడిందంటూ వ్యాఖ్యానించారు.ఈరోజు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు లిస్ట్ చేసిన నేతలపైనా మోడీ సెటైర్లు వేశారు. చివరి బంతికి సిక్సర్ కొట్టాలని వారు కోరుకుంటున్నారని ప్రధాని అన్నారు. ఇది వారి స్వంత అంతర్గత విశ్వాసానికి పరీక్ష అన్నారు. అవిశ్వాస ఓటుతో ఎవరు ఐక్యంగా ఉన్నారో, ఎవరు ప్రతిపక్షంలో లేరో స్పష్టంగా తెలుస్తుందని మోడీ పేర్కొన్నారు. 2018లోనే వారికి అవిశ్వాసం పెట్టామని మోడీ గుర్తుచేశారు.
విపక్ష కూటమిని ఘమండియా (అహంకార ఇండియా)గా మోడీ పేర్కొన్నారు . కొంతమంది చాలా అహంకారంతో ఉన్నారన్నారు. వారంతా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే వీరంతా రాజవంశాల్ని, బుజ్జగింపులను ప్రోత్సహిస్తున్నారంటూ మోడీ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications