కడప రైతు కిరాక్ ప్లాన్! యూట్యూబ్ చూసి లక్షల లాభాలు.. ప్రధాని ప్రశంసలు
పట్టణాల్లో కాఫీ షాపులు, హైటెక్ రెస్టారెంట్లలో నేడు 'అవకాడో టోస్ట్' అంటే ఒక ట్రెండ్. ఒకప్పుడు మన దేశంలో ఈ పండు పేరు కూడా చాలామందికి తెలియదు. డిమాండ్ లేదు, దీనికి మార్కెట్ విలువ అసలే లేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డైనింగ్ టేబుళ్ల నుంచి డైట్ చార్ట్ల వరకు ఎక్కడ చూసినా ఈ విదేశీ పండే కనిపిస్తోంది. సరిగ్గా ఈ ట్రెండ్ను పట్టుకున్న మన దక్షిణాది రైతులు.. సంప్రదాయ పంటల బాట వీడి అవకాడో సాగుతో లాభాల బాట పడుతున్నారు. ఈ వినూత్న వ్యవసాయ విప్లవంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు.

యూట్యూబ్ చూసి.. వైఎస్సార్ జిల్లా రైతు అద్భుతం!
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వరదరాజ్ కథే దీనికి సరైన ఉదాహరణ. ఏళ్ల తరబడి తన పొలంలో టమోటాలు, అరటి పంటలే వేసేవారు. అయితే, నిరంతరం ఒకే రకం పంటలు వేయడం కంటే కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఆలోచన ఆయనలో వచ్చింది. ఒక రోజు స్నేహితుడి తోటలో అవకాడో చెట్టును చూసి, దానిపై ఆసక్తి పెంచుకున్నారు. ఆలస్యం చేయకుండా యూట్యూబ్లో అవకాడో సాగుపై సమాచారం సేకరించి, సాంకేతిక పద్ధతులను తెలుసుకున్నారు. చిన్న కమతంలోనే ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించి, ఇప్పటివరకు ఏకంగా నాలుగు టన్నుల దిగుబడి సాధించారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా స్థానిక వ్యాపారులకే విక్రయిస్తూ ఊహించని రీతిలో మంచి రాబడి పొందుతున్నారు.
కాఫీ తోటల్లో అవకాడో మెరుపులు
కేవలం మన రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఈ పంట సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ అనే రైతు అర హెక్టారులో అవకాడో సాగు చేసి మంచి లాభాలు గడిస్తున్నారు. ఇక కర్ణాటకలోని చిక్కమగళూరు రైతులు మరో అడుగు ముందుకేసి భిన్నమైన ప్రయోగం చేశారు. అక్కడ కాఫీ, మిరియాల తోటల మధ్యలోనే అంతర్ పంటగా అవకాడో చెట్లను నాటారు. దీనివల్ల వేరే భూమి కేటాయించాల్సిన పనిలేకుండానే, సంప్రదాయ పంటల ద్వారా వచ్చే రాబడికి అదనంగా ఈ పండ్ల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది.
నగరాల రుచి.. మన రైతుల గెలుపు
మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో నగరాల్లో ప్రీమియం హెల్త్ మార్కెట్లో ఈ పండుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. సిటీ వాసుల ఆహార అలవాట్లకు అనుగుణంగా మన రైతులు ఆలోచించడమే ఇక్కడ అసలైన మలుపు. పట్టణాల్లోని రెస్టారెంట్లలో దొరికే అవకాడో టోస్ట్ రుచి పెరగడమే కాదు, దాని వెనుక మన దేశీయ రైతుల కష్టం, తెలివితేటలు దాగి ఉన్నాయి. కొత్త ఆలోచన, ఆధునిక సాగు పద్ధతులు, నేరుగా మార్కెటింగ్ చేసుకునే నైపుణ్యం తోడైతే వ్యవసాయం ఎప్పటికీ నష్టాల బాట పట్టదని దక్షిణాది రైతులు నిరూపించి చూపించారు.














Click it and Unblock the Notifications