మమతపై మోడీ ప్రశంసలు- తుఫాన్ ఎదుర్కొన్న తీరు అద్భుతమంటూ కితాబు...
ఎప్పుడూ ఉప్పూ నిప్పులా ఉండే ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకోవడం అరుదుగా చూస్తుంటాం. అలాంటిదే ఓ సందర్భం ఇవాళ మరోసారి కనిపించింది. యాంఫన్ తుపాను బారిన పడిన బెంగాల్లోని పలు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు మోడీ ఇవాళ కోల్ కతా చేరుకున్నారు. అక్కడ ప్రధానికి స్వాగతం పలికిన మమత.. ఆ తర్వాత ప్రధానితో కలిసి ఏరియల్ సర్వేకు వెళ్లారు. తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రధానికి మమత అన్ని వివరాలు అందించారు. సర్వే అనంతరం మాట్లాడిన ప్రధాని పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వాని ప్రశంసలతో ముంచెత్తారు.
Recommended Video
యాంఫన్ తుపానును మమత సర్కారు ఎదుర్కొన్న తీరు ఎంతో అద్భుతమని మోడీ ప్రశంసించారు. వెంటనే తుపాన్ ప్రభావిత బెంగాల్ కు వెయ్యి కోట్ల సాయాన్ని ప్రకటించడమే కాకుండా అది రాష్ట్ర ప్రభుత్వాన్ని చేరే వరకూ వదలిపెట్టబోనని మోడీ స్పష్టం చేశారు.
తుపాను సహాయక చర్యల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటాయని మోడీ మమత సమక్షంలో చెప్పుకొచ్చారు. అదే సమయంలో కరోనా విషయంలో కేంద్రంపై మండిపడుతున్న మమతా బెనర్జీని ఆ విషయంలోనూ మోడీ ప్రశంసించడం విశేషం. కరోనాను మమత అద్భుతంగా కట్టడి చేస్తున్నారని ప్రధాని ప్రశంసల్లో ముంచెత్తారు.

బెంగాల్లో యాంఫన్ తుపాను సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల సాయం ప్రకటించారు. బెంగాల్లో తుపాన్ కారణంగా 80 మంది చనిపోగా.. వందల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు.












Click it and Unblock the Notifications