ఆ ట్యాంకర్లు 24గం. తిరగాల్సిందే -ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోదీ సమీక్ష, కీలక ఆదేశాలు
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరడం, కొత్తగా వ్యాధి బారినపడి ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగడంతో వివిధ రాష్ట్రాల్లో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. నేపథ్యంలో దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు..
అచ్చెన్నకు హోం శాఖ ఖరారు -పార్టీ మార్పుపై విజయసాయిరెడ్డి క్లారిటీ -గురుమూర్తి నిఖార్సైన హిందువు
వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో ప్రధాని కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. కేంద్రమంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలన్నారు. కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న 12 రాష్ట్రాలైన- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ, దిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హరియాణా, రాజస్థాన్లో ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.
దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు ఆక్సిజన్ ట్యాంకర్లు తిరిగేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఆక్సిజన్ ఉత్పత్తి గురించి అధికారులు వివరించగా.. ప్రతి ప్లాంట్ సామర్థ్యం ప్రకారం ఉత్పత్తిని పెంచాలని మోదీ సూచించారు. సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్లు అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 24 గంటలు పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన ఆదేశించారు. డ్రైవర్లు షిఫ్టుల విధానంలో ఆక్సిజన్ సరఫరా చేయాలన్నారు.
ఎంపీ రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిల జాకెట్ చించడం తప్పు, మరి అమరావతి మహిళల సంగతేటి?
కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన వివరాల ప్రకారం నిన్న ఒక్కరోజే కొత్తగా 2.04లక్షల పాజిటివ్ కేసులు, 1070 మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం కేసులు 1, 44, 92,015కు పెరగ్గా, మరణాల సంఖ్య 1,75,405కు చేరింది. 17 లక్షలకు చేరువగా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా 11.72 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేశారు.