ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలు - ప్రతీ అంశంపై చర్చకు సిద్దం : ప్రధాని మోదీ..!!
ఈ రోజు నుంచి జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవిగా ప్రధాని మోదీ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు.
దేశ ఉజ్వల భవిష్యత్తుకు శుభ సంకేతమంటూ
రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశ వ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' నిర్వహిస్తున్నామని చెప్పారు. అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కలల సాకారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు తమ వంతు సాయం చేస్తున్నారని చెప్పారు. ప్రజల సేవ.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు శుభ సంకేతమన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే రైతు చట్టాలకు ఉపసంహరించుకుంటూ ప్రకటన చేసారు.
రైతు చట్టాల ఉపసంహరణ
దీనికి అనుగుణంగా కేబినెట్ లోనూ ఆమోదం లభించింది. ఈ రోజున తొలి రోజు సమావేశాల్లోనే బిల్లులను ఉపసంహరించుకుంటూ కేంద్రం అధికారికంగా అమలు చేయనుంది. ఇక, విపక్షాలు ఇప్పటికే వీటి పైన వాయిదా తీర్మానం ఇచ్చాయి. రైతులకు కనీస మద్దతు దర కల్పించేలా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీని పైన వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఇక, ఈ సమావేశాల్లో మొత్తం 30 బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. అయితే, రైతు చట్టాల ఉపసంహరణ తో పాటుగా ఆందోళన చేస్తూ మరణించిన రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
తొలి రోజునే సభలో అందోళన
ఈ రోజు సభ ప్రారంభం అవుతూనే విపక్ష సభ్యులు జై కిసాన్ అంటూ నినాదాలు చేసారు. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత, ఈ మధ్య కాలంలో మరణించిన మాజీ సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఆ తరువాత విపక్షాలు ఆందోళనకు దిగటం...ప్రశ్నోత్తరాలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ...రైతులకు అనుకూలంగా నినాదాలు చేసారు. దీంతో..స్పీకర్ సభను వాయిదా వేసారు. అదే సమయంలో ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రాంగణంలోకి గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేసారు.