మోదీ-బైడెన్ ఫోన్ సంభాషణ... ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే... రెగ్యులర్గా టచ్లో ఉండాలని నిర్ణయం...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఫోన్ ద్వారా జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కరోనాపై పోరులో భారత్కు అమెరికా మద్దతు పట్ల మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఇరు దేశాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. అమెరికా నుంచి భారత్కు కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకు రవాణాపై ప్రధానంగా చర్చించినట్లు పేర్కొన్నారు. భారత్-అమెరికా హెల్త్ కేర్ భాగస్వామ్యం ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోగలదని వ్యాఖ్యానించారు.
అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు మరోసారి తన సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ సందర్భంగా... భారత్కు అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. వెంటిలేటర్లు,కోవీషీల్డ్ ముడి సరుకు,ఇతరత్రా వైద్య సామాగ్రి,మెడికల్ సప్లైని అందిస్తామని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన కొత్తలో అమెరికాకు భారత్ ఎలాగైతే సాయం అందించిందో... ఇప్పుడు భారత్కు కూడా అమెరికా అలాగే సాయం అందించేందుకు సిద్దంగా ఉందన్నారు.
ఇరు దేశాల అధినేతలు రెగ్యులర్గా టచ్లో ఉండేందుకు పరస్పర ఆమోదం తెలిపారు. భారత్-అమెరికా అధికారులు ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ పరస్పర సమన్వయంతో,సహకారంతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
Recommended Video
భారత్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకు రవాణాపై అమెరికా మొదట ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. భారత్కు అత్యంత సన్నిహిత దేశంగా,కీలక భాగస్వామిగా పేరున్న అమెరికా... ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మిత్ర దేశం పట్ల కఠినంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గక తప్పలేదు. భారత్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిసరుకును సరఫరా చేస్తామని ఆదివారం(ఏప్రిల్ 26) ప్రకటించింది. ఆ మరుసటిరోజే ఇరు దేశాల అధినేతలు ఫోన్ ద్వారా చర్చలు జరపడం గమనార్హం.
భారత్కు సాయం అందించే విషయంలో యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్తోపాటు అక్కడి చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ ఇండియన్ అమెరికన్లు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.స్టోరేజీలో అదనపు వ్యాక్సిన్లను భద్రపరిచే బదులు... వాటిని భారత్,బ్రెజిల్ లాంటి దేశాలకు అందించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం అమెరికా కంటే ఆ దేశాలకే ఈ వ్యాక్సిన్ల అవసరం ఎక్కువగా ఉందని వాదించారు. దీంతో ఆంక్షలపై వెనక్కి తగ్గిన అమెరికా భారత్కు అవసరమైన సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది.