రూ 107 లక్షల కోట్లతో గతిశక్తి ప్రణాళికలు - దేశ స్వరూపాన్నే మార్చేస్తాయి : ప్రధాని మోదీ..!!
2021-22 సాధారణ బడ్జెట్ లో ప్రకటించిన పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ కొత్త మోడల్ను కూడా ప్రధాని సమీక్షించారు.
రానున్న 25 ఏళ్ల కాలం కోసం ఈ ఫౌండేషన్ పని చేస్తుందని స్పష్టం చేసారు. జాతీయ మాస్టర్ ప్లాన్ విధానంతో 21వ శతాబ్ధపు అభివృద్ధి ప్రణాళికలకు గతిశక్తి లభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం ద్వారా అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో ముగుస్తాయన్నారు. గతంలో ఎక్కడకు వెళ్లినా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్న బోర్డులు కనిపించేవని ఎద్దేవా చేసారు.
వీటిని చూసిన ప్రజల్లో అవి పూర్తి కావనే అపనమ్మకం ఏర్పడిందన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు. పక్కా ప్రణాళికలతో.. పకడ్బందీ ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని వెల్లడించారు. గతంలో పాలన చేసిన ఏ రాజకీయ పార్టీ మౌళిక వసతుల కల్పన..సదుపాయా అభివృద్ధిపై దృష్టిపెట్టలేదన్నారు. ఆ పార్టీల మ్యానిఫెస్టోల్లో అవి ఉండేదికాదన్నారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలన్నా.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నా.. ఉద్యోగ కల్పన చేయాలన్నా.. నాణ్యమైన మౌళిక సదుపాయాలు అవసరమని మోదీ అన్నారు.

గతిశక్తి ప్రణాళికల గురించి ప్రధాని వివరించారు. రానున్న అయిదేళ్లలో కొత్తగా 220 విమానాశ్రయాలను నిర్మించనున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 25వేల ఎకరాల విస్తీర్ణంలో 11 పారిశ్రామిక వాడలను అభివృద్ధిపరచనున్నారు. సైనిక దళాలను బలోపేతం చేసేందుకు 1.7 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. 38 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్యవ్యవస్థను పటిష్టం చేసేందుకు 109 ఫార్మా క్లస్టర్లను ఓపెన్ చేయనున్నారు.
ఇందులో సుమారు 107 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయని... ఈ ప్రాజెక్టులు దేశ స్వరూపాన్ని మార్చనున్నాయని చెప్పారు. జాతీయ రహదారుల్ని బలోపేతం చేసేందుకు సుమారు రెండు లక్షల కిలోమీటర్ల మేర ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైల్వేల ద్వారా 1600 మిలియన్ టన్నుల కార్గోను తరలించనున్నారని చెప్పుకొచ్చారు. 35వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్యాస్ పైప్లైన్ కనెక్టివిటీ పెంచనున్నారు.












Click it and Unblock the Notifications