లంచ్ బాక్స్తో సచివాలయానికి సీఎం! విజయ్ మార్క్ పాలన ఇదే
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ద్రవిడ కోటపై జెండా పాతిన నటుడు, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (Vijay) పాలనలోనూ తన మార్క్ విలక్షణతను చాటుకుంటున్నారు. మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన చూపిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన తమిళనాడు అధికార వర్గాలనే కాదు.. దేశవ్యాప్త రాజకీయ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సర్వాధికారాలు ఉన్నప్పటికీ.. ఏమాత్రం హడావుడి లేకుండా ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తరహాలో ఆయన నిత్యం విధులకు హాజరవుతున్న తీరుపై సచివాలయ ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ పాటిస్తున్న క్రమశిక్షణ తమిళ రాష్ట్ర సచివాలయంలో కొత్త వేగాన్ని తెచ్చింది. ప్రతిరోజూ నిర్దేశిత సమయానికి పావుగంట ముందే ఆయన సచివాలయంలోని తన ఛాంబర్కు చేరుకుంటున్నారు. వీవీఐపీ లంచ్ ప్రోటోకాల్స్కు స్వస్తి పలికి, ప్రతిరోజూ తన ఇంటి నుంచే స్వయంగా 'లంచ్ బాక్స్' తెచ్చుకుంటూ సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు.
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బయటకు వెళ్లకుండా, తన ఛాంబర్లోనే భోజనం ముగించి వెంటనే తిరిగి ఫైళ్ల పరిశీలనలో నిమగ్నమవుతున్నారు. కేవలం సమయపాలనకే పరిమితం కాకుండా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఎన్నికల హామీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంపై ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

వీఐపీ కల్చర్కు 'బ్రేక్'.. రోడ్లపై నో ట్రాఫిక్ జామ్స్!
ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం చెన్నై నగర సామాన్య ప్రజల నుంచి జేజేలు అందుకుంటోంది. సాధారణంగా ఒక సీఎం కాన్వాయ్ వస్తోందంటే గంటల ముందే రోడ్లను క్లోజ్ చేయడం, సామాన్యుల వాహనాలను నిలిపివేయడం సర్వసాధారణం. అయితే, ఈ వీఐపీ కల్చర్కు సీఎం విజయ్ పూర్తిగా బ్రేక్ వేశారు. తన కాన్వాయ్ ప్రయాణించే సమయంలో సామాన్య ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదని భావించిన ఆయన.. చెన్నై సిటీ ట్రాఫిక్ పోలీసులతో చర్చించి ఒక 'మాస్టర్ ప్లాన్' అమల్లోకి తెచ్చారు.
సింగిల్ లైన్ కాన్వాయ్ వ్యూహం..
చెన్నై నగరంలో కనీసం మూడు లైన్ల రహదారులు ఉంటాయి. ఈ నయా ప్లాన్ ప్రకారం.. సీఎం కాన్వాయ్ కేవలం ఒకే ఒక్క నిర్దేశిత లైన్ గుండా వెళుతుంది. ఆ లైన్ను మాత్రమే పోలీసులు క్లియర్ ఉంచుతారు. అదే సమయంలో మిగిలిన రెండు లైన్లలో సాధారణ ప్రజల వాహనాలు ఎప్పటిలాగే ప్రయాణిస్తూనే ఉంటాయి. అంటే సీఎం కోసం రోడ్డు మొత్తాన్ని క్లోజ్ చేసే సంప్రదాయానికి విజయ్ చరమగీతం పాడారు.
దీనికి తోడు చెన్నై మహానగర ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం విజయ్ ఉదయం చాలా ఎర్లీగానే (అతి త్వరగా) సెక్రటేరియట్ లేదా తన ఇతర అధికారిక కార్యక్రమాలకు బయలుదేరుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక పాలకుడు సామాన్యుడిలా ఆలోచించి అమలు చేస్తున్న ఈ వినూత్న నిర్ణయాలు అటు ఐఏఎస్ వర్గాలలో, ఇటు ప్రజలలో భారీ ఆదరణ పొందుతున్నాయి.














Click it and Unblock the Notifications