కాశీ విశ్వనాథుడి ఆలయం వర్కర్లకు చెప్పులను బహూకరించిన ప్రధాని మోడీ: వాటి స్పెషాలిటీ ఇదే
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్, పంజాబ్లల్లో ఎన్నికల నగారా మోగింది. ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ఫిబ్రవరి 10వ తేదీన తొలి దశ పోలింగ్ మొదలవుతుంది. చివరిదశ మార్చి 7వ తేదీన ముగుస్తుంది. 10న కౌంటింగ్ ఉంటుంది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది.
403 స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రంగా..
అదే హోదాలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే పట్టుదలతో కనిపిస్తోంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తర ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలో రావడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఆయన సారథ్యంలో ఎన్నికల బరిలోకి దిగింది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.
ఏడు విడతల్లో..
ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. 2017 నాటి ఎన్నికల్లో బీజేపీ..తన మిత్రపక్షం అప్నాదళ్ (సోనేలాల్)తో కలిసి 312 సీట్లను కైవసం చేసుకుంది. తిరుగులేని ఆధిపత్యం ఇది. వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్నికల బరిలో దిగింది. ప్రతిపక్ష సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్కు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తోంది. అందుకే అందుబాటులో ఉన్న అన్ని వనరులను కూడా వినియోగించుకుంటోంది.
కాశీ విశ్వనాథుడి ఆలయ సిబ్బందికి..
తాజాగా- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్ వారణాశిలో గల ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయం సిబ్బందికి వంద జతల చెప్పులను బహూకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారణాశి.. ప్రధాని మోడీ సొంత లోక్సభ నియోజకవర్గం. కొద్దిరోజుల కిందటే ఆయన ఇక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. కాశీ విశ్వనాథ్ కారిడార్ను ఆయన ప్రారంభించారు. రెండు రోజుల పాటు వారణాశిలో గడిపారు. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అవి నిషేధం..
ఈ సందర్భంగా అక్కడి అర్చకులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు చెప్పులు లేకుండా ఆలయం ప్రాంగణంలో కలియతిరగడాన్ని గమనించారు. వణికించే చలిలోనూ కాళ్లకు ఎలాంటి రక్షణ లేకుండా విధుల్లో పాల్గొంటున్నట్లు ప్రధాని గుర్తించారు. దీనిపై ఆరా తీశారు. ఆలయం పరిసర ప్రాంతాలు, ప్రాంగణంలో చర్మం, రబ్బరుతో తయారు చేసిన చెప్పులను ధరించడాన్ని నిషేధించినట్లు ఆలయ అధికారులు ప్రధానికి వివరించారు.
జనపనారతో తయారు చేసిన చెప్పులు..
అందువల్లే సిబ్బంది, కార్మికులు చెప్పులు ధరించకుండా విధులకు హాజరవుతున్నట్లు ఆయనకు తెలిపారు. దీనితో ఆయన తాజాగా- అక్కడి సిబ్బంది, కార్మికులకు 100 జతల చెప్పులను పంపించారు. జనపనారతో తయారు చేసిన చెప్పులు అవి. వాటి తయారీలో నిషేధిత వస్తువులనేవీ వినియోగించలేదు. జనపనారతో ఎకో-ఫ్రెండ్లీ వస్తువులతో తయారు చేసినవి కావడం వల్ల ఆలయ ప్రాంగణంలో అర్చుకులు, కార్మికులు, సిబ్బంది.. వాటిని ధరించడానికి వెసలుబాటు కలిగినట్టయింది.