బంగ్లా ప్రధాని వచ్చిన వేళ: ప్రోటోకాల్ పక్కనపెట్టి మోడీ ఇలా!..
దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్కు చెందిన ప్రధాని ఇండియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. శనివారం నాడు ప్రధాని మోడీ బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అవనున్నారు.
న్యూఢిల్లీ: రోడ్డుపై ఎవరైనా వీఐపీ వెళ్తున్నారంటే ట్రాఫిక్ పోలీసులు చాలాసేపు వాహనాలను నిలిపివేస్తారు. అలాంటిది ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తన ప్రోటోకాల్ పక్కనబెట్టి సాధారణ మార్గంలోనే ప్రయాణించారు. ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్కు చెందిన ప్రధాని ఇండియాలో అడుగుపెడుతున్న నేపథ్యంలో.. స్వాగతం పలకడానికి వెళ్లిన మోడీ ఈవిధంగా వ్యవహరించారు.
సాధారణంగా అయితే ప్రధాని కాన్వాయ్ రెండు మూడు కి.మీ దూరం ఉండగానే పోలీసులు ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. కానీ ప్రోటోకాల్ పక్కనబెట్టి మరీ ప్రధాని మోడీ సాధారణంగా ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో బంగ్లా ప్రధానికి ఆయన స్వాగతం పలికారు. కాగా, నాలుగు రోజుల పర్యటన కోసం బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఇండియాలో అడుగుపెట్టారు.
దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్కు చెందిన ప్రధాని ఇండియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. శనివారం నాడు ప్రధాని మోడీ బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అవనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. బంగ్లా ప్రధానితో భేటీలో భాగంగా ఆ దేశానికి భారత్ దాదాపు 500మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రకటించే అవకాశం ఉంది.