బీజేపీ లేనిచోట మహిళలకు భద్రత ఏది?సీఎం తల్లిని అవమానిస్తారా? రాజా 2జీ మిస్సైల్ -తమిళనాడులో మోదీ ఫైర్
బీజేపీయేత పార్టీలు అధికారంలో కొనసాగుతోన్న రాష్ట్రాల్లో మహిళలకు భద్రత కరువైందని, ఈ దేశంలో ఆడవాళ్లను కాపాడగలిగేది ఒక్క బీజేపీ పార్టీనే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతిపక్ష పార్టీల పాలనలో మహిళలు ఘోరమైన అవమానాలు, దాడులు ఎదుర్కొంటున్నారని, కనీసం దాడుల్ని ఖండిచలేని దుస్థితిలో ఆ పార్టీలు ఉండటం దారుణమని మండిపడ్డారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ధారాపురంలో బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. డీఎంకే నేత, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితుడైన ఏ.రాజా ఇటీవల తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, గతంలో అసెంబ్లీ సాక్షిగా జయలలిత చీర ఊడదీసి అవమానించడం, అటు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్త తల్లి అయిన 82 ఏళ్ల వృద్ధురాలిని టీఎంసీ కార్యకర్తలు కొట్టి చంపారన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఏలుబడిలోని అన్ని రాష్ట్రాల్లో మహిళల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.

నిత్యం అబద్ధాలు చెప్పడం, మహిళల్ని అవమానించడం కాంగ్రెస్-డీఎంకే కూటమికి అలవాటుగా కొనసాగుతున్నదని, నాడు అసెంబ్లీలో జయలలితకు ఘోర అవమానం జరిగినప్పుడు ఏ ఒక్కరూ అడ్డుకోలేకపోయారని, అటు బెంగాల్ లో వృద్ధురాలిపై టీఎంసీ కార్యకర్తల దాడి కూడా గర్హనీయమని మోదీ అన్నారు. డీఎంకే నేత ఏ రాజాను 'కాలం చెల్లిన 2జీ మిస్సైల్'తో పోల్చుతూ, తమిళనాడు మహిళలపై కాంగ్రెస్-డీఎంకే అలాంటి క్షిపణుల్ని ప్రయోగిస్తున్నదని ప్రధాని మండిపడ్డారు.

మహిళల్ని ఇంత ఘోరంగా అవమానించే కాంగ్రెస్-డీఎంకేలు తమిళనాడులో మహిళా సాధికరతను సాధించలేవని, ఆ రెండు పార్టీలకూ వారసత్వ నాయకులను కాపాడుకోవడం ఒక్కటే ప్రాధాన్యం అని మోదీ విమర్శించారు. తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే కూటమి మళ్లీ గెలిస్తే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళుతామని, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి.












Click it and Unblock the Notifications