కేరళ విలయం: సీఎంతో మోడీ సమీక్ష: ఏరియల్ సర్వే, రూ.500కోట్ల తక్షణ సాయం
Recommended Video
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్నిపరిశీలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి కేరళకు వెళ్లారు. శనివారం ఉదయం తిరువనంతపురం నుంచి కొచ్చికి వెళ్లిన మోడీ అక్కడి నుంచి ఏరియల్ సర్వేలో పాల్గొనాల్సి ఉండగా భారీ వర్షం కారణంగా ఆ కార్యక్రమం రద్దయింది. అయితే, కొంత సేపటి తర్వాత సీఎం పినరయి విజయన్తో కలిసి ప్రధాని మోడీ హెలికాప్టర్లో వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
సీఎం, మంత్రులతో సమీక్ష
అంతకుముందు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సర్వే చేసేందుకు టేకాఫ్ అయిన హెలికాప్టర్ కొన్ని క్షణాల్లోనే కిందకు దిగిపోయింది. దీంతో ప్రధాని మోడీ కేరళ సీఎం పినరయి విజయన్, రెవెన్యూ మంత్రి చంద్రశేఖరన్లతో కలిసి నిర్వహించాల్సిన ఏరియల్ సర్వేలో పాల్గొనలేకపోయారు.
ఆ తర్వాత మోడీ వెంటనే కొచ్చిలో పినరయి విజయన్, ఇతర మంత్రులతో సమావేశమై రాష్ట్ర పరిస్థితి గురించి సమీక్షించారు. మోడీ గత రెండు మూడు రోజుల నుంచే విజయన్తో ఫోన్లో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితిని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
తక్షణ సాయంగా రూ.500కోట్లు
కేరళ సీఎం, మంత్రులు, అధికారులతో వరదలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తక్షణ సాయంగా రూ.500కోట్లు ప్రకటించారు. వరదల్లో మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 2లక్షల ఎక్స్గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50వేలు ప్రకటించారు.
385మందికి చేరిన మృతులు
కేరళలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు సంభవించాయి. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 385 మందికి చేరినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం గత రెండ్రోజుల్లోనే 150మంది చనిపోయినట్లు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్టీఆర్ఎఫ్తో పాటు నేవీ, ఆర్మీ, వాయుసేన, ఇతర సహాయక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపు రవాణా వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. సుమారు రూ.10వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
కంటతడి పెట్టిన ఎమ్మెల్యే..
రవాణా వ్యవస్థలు నాశనమవ్వడం వల్ల ప్రజలకు ఆహారం అందడం చాలా కష్టంగా మారిందని, ఆకలితో అలమటించి ప్రజలు మరణించే ప్రమాదముందని చెన్గన్నూర్ ఎమ్మెల్యే సాజి చెరియన్ కన్నీటి పర్యంతమ్యారు. సాయం అందకపోతే ఆకలి చావులు ఎక్కువ అవుతాయని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం కొన్ని చోట్ల మృతదేహాలు వరద నీటిలో తేలుతూ కనిపించాయి. పథానంతిట్ట ప్రాంతంలో మూడు మృతదేహాలు, ఇడుక్కిలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
కొచ్చి విమానాశ్రయం మూత..
రన్వేలో నీరు నిలిచిపోవడంతో కోచి విమానాశ్రయాన్ని మూసివేశారు. వారం పాటు ఉచితంగా కాల్స్, డాటా సేవలు అందించనున్నట్టు టెలికాం కంపెనీలు ప్రకటించాయి. కాగా, రాజధాని తిరువనంతపురంతో పాటు, చాలా చోట్ల పెట్రోలు, డీజిల్ నిల్వలు లేవు. ఇంధనం కోసం రాజధానిలోని పెట్రోలు బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. సహాయ చర్యలు చేపట్టడం కోసం ప్రతి బంకులోనూ 3000 లీటర్ల డీజిల్, 1000 లీటర్ల పెట్రోలును తప్పనిసరిగా నిల్వ ఉంచాలని అధికారులు ఆదేశించారు.
శిబిరాల్లో లక్షల మంది..
శిబిరాల్లో 3.14 లక్షల మంది: పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1568 పునరావాస శిబిరాల్లోకి 3.14 లక్షల మంది (70 వేలకు పైగా కుటుంబాలు)ని తరలించారు. రైల్వే శాఖ 1.20 లక్షల నీటి బాటిళ్లను సరఫరా చేసింది. 2.9 లక్షల లీటర్ల మంచినీటితో కాయంకులానికి ఓ ప్రత్యేక రైలును పంపించింది
హైదరాబాద్ నుంచి కేరళకు ఆహారపదార్థాలు
తమ వారిని ఆదుకోవాలంటూ ప్రవాస కేరళీయలు వాట్సాప్ ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తన తల్లిదండ్రులు అలువాలో రెండు రోజులుగా చిక్కుకున్నారని, వారిని కాపాడాలని ఆస్ట్రేలియాకు చెందిన సౌమ్య కోరారు. ఆసుపత్రిలోఆక్సిజన్ లేక మేరీ వర్ఘీస్ విషమ పరిస్థితిలో ఉన్నారంటూ మరొకరు సందేశాన్ని పంపారు. కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి వీటిని కేరళకు తరలించనున్నట్లు పేర్కొన్నాయి.
ప్రాణాలు కాపాడుతున్న త్రివిధ దళాలు
వరదల కారణంగా చాలా గ్రామాలు దీవుల్లా మారిపోయాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగి రోడ్లపై పడడంతో ఆయా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడి వారిని ఆదుకోవడంలో జాతీయ విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్), సైన్యం, వాయుసేన, నౌకా సేన సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వేలాది మందిని వరద ప్రాంతాల నుంచి కాపాడుతున్నారు. ఇళ్ల పైకప్పులు, ఎత్తయిన ప్రదేశాలు, పడవులు వెళ్లలోని ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నావికా దళం 42 బృందాలను పంపించి 52 బోట్లను వినియోగిస్తోంది. కోస్టు గార్డు 28 బృందాలను, 30 బోట్లను పంపించింది. వాయుసేన 23 హెలికాప్టర్లు, 11 సరకు రవాణా విమానాలతో సేవలు అందిస్తోంది. సైన్యానికి చెందిన 10 కాలాల సిబ్బంది, 10 ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్సు సిబ్బంది నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. వారు కూడా 53 మిలటరీ బోట్లను తీసుకొచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసేలా 38 తాత్కాలిక వంతెనలు నిర్మించారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 51 బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, వాయుసేన, నావికా దళం బాధితులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.