21న ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 21వ తేదీన సిక్కుల మతగురువు తేగ్ బహదూర్ 400 జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసగించనున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఆయన స్మారకంగా ఆ రోజే పోస్టల్ స్టాంపు, నాణేన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. అయితే, నరేంద్ర మోడీ గురువారం అదే తరహాలో ప్రసంగించనుండడం విశేషం. ఈ కార్యక్రమానికి వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
నాలుగు వందల మంది సిక్కు సంగీతకారులు 'షాబాద్ కీర్తన' చేస్తారని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. ఢిల్లీ గురుద్వారా మేనేజమెంట్ సహకారంతో కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సిక్కుల మతగురువు తేగ్ బహదూర్ 400 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ 20-21 తేదీల్లో జరిగే వేడుకలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారు. ఏప్రిల్ 20న అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో లైట్ అండ్ సౌండ్ పెర్ఫార్మెన్స్తో పాటు యువకుల నేతృత్వంలో షాబాద్ కీర్తన కూడా ఉంటుంది.
1621లో తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ అమృత్సర్లో జన్మించారు. 1675లో, మొఘల్ పాలకుడు ఔరంగజేబు అతన్ని ఢిల్లీలో చంపాడు. ఎర్రకోట సమీపంలో ఉన్న ప్రసిద్ధ గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్, గురు తేజ్ బహదూర్ను ఉరితీసిన ప్రదేశంలో నిర్మించబడింది.