24న గ్రామ పంచాయతీ ప్రతినిధులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలతో కరోనా నియంత్రణలోనే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడూ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, అధికారులతో సమీక్షలు జరుపుతూ కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా, ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ను ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు.
కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించడంపై ప్రతినిధులతో ప్రధాని చర్చించనున్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వారిని ప్రధాని కోరనున్నారు. కాగా, ఏప్రిల్ 27న దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కరోనాపై సమీక్షించనున్న విషయం తెలిసిందే.
On Friday 24th April, which is marked as National Panchayati Raj Day, will be interacting with Sarpanchs from across the nation via video conferencing. I look forward to this interaction. https://t.co/9BmGcNsEAH
— Narendra Modi (@narendramodi) April 22, 2020
కాగా, కరోనా మహమ్మారి కట్టడికి ఎంతో శ్రమిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది భద్రత కోసమే కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వైద్య సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. కాగా, కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు కేంద్రం 1987 అంటువ్యాధుల చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఎవరైనా వైద్య సిబ్బందిపై దాడి చేస్తే.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంతేగాక, దాడి సమయంలో వైద్య సిబ్బంది వాహనాలు, ఆస్పత్రికి సంబంధించిన వస్తువులు ధ్వంసం చేస్తే మార్కెట్ విలువ ప్రకారం లెక్కించి దానికి రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తారు. సుమారు రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. తాజాగా ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే అమల్లోకి వస్తుంది.