gujarat cable bridge : కేబుల్ బ్రిడ్జి ఘటనా స్ధలికి ప్రధాని మోడీ-ఆస్పత్రిలో బాధితుల పరామర్శ
గుజరాత్ లోని మోర్బీ వద్ద కేబుల్ వంతెన కూలిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనకు కారకులైన 10 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. మరోవైపు ఇవాళ ఘటనా స్ధలిని ప్రధాని మోడీ సందర్శించారు. అనంతరం బాధితుల్ని ఆస్పత్రిలో పరామర్శించారు.
ఆదివారం మోర్బీలో కేబుల్ వంతెన కూలిన స్ధలాన్ని గుజరాత్ సీఎంతో పాటు ఇతర అధికారులతో కలిసి ప్రధాని మోడీ సందర్శించారు. ఈ ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్ధానిక బీజేపీ సర్కార్ పై మోడీ ఆగ్రహంగా ఉన్నారు. అసలే ఈ ఏడాది ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో బీజేపీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రధాని మోడీ ఘటనా స్ధలికి వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు.
అనంతరం మోర్బీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని మోడీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్దితిపై డాక్టర్లను ఆరా తీశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మోడీ రాకతో మోర్బీ ఆస్పత్రి వద్ద భారీ ఎత్తున క్షతగాత్రుల బంధువులు తరలివచ్చారు. మోర్బీ ఘటనపై విపక్ష కాంగ్రెస్,ఆప్ ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఘటనకు బాధ్యతగా బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కేజ్రివాల్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో మోడీ నష్టనివారణ చర్యలకు దిగారు.