కరోనా: లాక్డౌన్పై మోదీ కీలక అడుగు.. మే 3 తర్వాత ఇదీ విధానం.. మెజార్టీ సీఎంలు కోరినట్లే..
'కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికి లాక్డౌన్ ఒక్కటే బెస్ట్ మార్గం' అని 100కుపైగా దేశాలు విశ్వసించాయి. వైరస్ విజృంభించిన తొలిదశలోనే 50కిపైగా దేశాలు పాక్షికంగా, సుమారు 30 దేశాలు సంపూర్ణంగా లాక్ డౌన్ ప్రకటించాయి. కానీ నెలలు గడుస్తున్నా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాలేదు సరికదా, కేసులు సంఖ్య, మరణాలు భారీగా పెరిగిపోయాయి. కరోనాకు మందు ఎప్పుడొస్తుందో తెలీదు.. వైరస్ ప్రభావం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో అంచనాలేవు.. అప్పటిదాకా అన్ని మూసుకుని కూర్చునే పరిస్థితి అసలే లేదు.. కాబట్టే ఆయా ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో గంభీర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పుడా జాబితాలో భారత్ కూడా చేరేందుకు రెడీ అవుతోంది..

అమెరికాలో ఎత్తేశారు..
భారత్ లో కరోనా లాక్ డౌన్ గడువు(మే 3) దగ్గర పడుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్జిట్ స్ట్రాటజీపై దృష్టిసారించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్ జరగడానికి కొద్ది గంటల ముందు.. మోస్ట్ ఎఫెక్టెడ్ దేశాలైన అమెరికా, స్పెయిన్ తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. యూఎస్ లో కేసుల సంఖ్య 10లక్షలు, మరణాలు 55వేలకు చేరినప్పటికీ అక్కడి రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం వద్దని సూచించినా, గవర్నర్లు రీఓపెనింగ్ కు మొగ్గుచూపారు. 2.26లక్షల కేసులు, 23వేల మరణాలు సంభవించిన స్పెయిన్ లోనూ దశలవారీ లాక్ డౌన్ ఎత్తివేత ఆదివారంమే ప్రారంభమైంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న ఇతర దేశాలు లాక్ డౌన్ ఎగ్జిట్ పై తమదైన స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నాయి.

మనమేం చేద్దాం?
లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేదానిపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నాలుగైదు రాష్ట్రాలు మినహా మెజార్టీ రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపులు కోరడం గమనార్హం. అయితే ఓ వైపు లాక్ డౌన్ ఎత్తేయాలంటూనే.. కేసుల పెరుగుదలపై సీఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ప్రధాని మోదీ కలగజేసుకుని, కేసులు పెరిగినంత మాత్రాన గాభరా పడొద్దన్నారు. మన దగ్గర నమోదవుతోన్న కొవిడ్-19 కేసుల్లో 90 శాతానికిపైగా మైల్డ్ కేసులేనని, ముందుగానే లాక్ డౌన్ ప్రకటించడం, దానికి రాష్ట్రాలు పూర్తిగా సహకరించడం వల్లే పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చిందని గుర్తుచేశారు. సీఎంల వాదనల్ని సావధానంగా విని, చదివిన తర్వాత పీఎం కంక్లూజన్ ఇచ్చారు..

రీస్టార్ట్ కావాల్సిందే..
కేసుల సంఖ్యను చూసి భయపడొద్దన్న ప్రధాని మోదీ.. కరోనాపై పోరాటం కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థను పున:ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉందని గట్టిగా అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మెజార్టీ సీఎంలు కోరినట్లు.. మే 3 తర్వాత హాట్ స్పాట్స్(రెడ్ జోన్ల)లో మాత్రమే పూర్తిస్థాయి లాక్ డౌన్ కొనసాగిస్తూ, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో నిషేధాల్ని సడలించడమే మంచిదన్న వాదనకు మోదీ మొగ్గచూపినట్లు సమాచారం. అయితే ఒకేసారి లాక్ డౌన్ ఎత్తేయకుండా, మే 3 తర్వాత దశలవారీగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను విస్తరిస్తూ వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది.

మళ్లీ జనం ముందుకు మోదీ..
కరోనా విలయకాలంలో ప్రభుత్వం చేయదల్చుకున్న పనుల్ని ప్రజలకు వివరిస్తూ, మద్దతు కోరుతోన్న ప్రధని మోదీ.. మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించే అవకాశముంది. లాక్ డౌన్ గడువు ఇంకా ఆరు రోజుల్లో ముగియనుండటంతో ఆ లోపే ఆయన అధికారిక ప్రకటన చేస్తారని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎకానమీ రీస్టార్ట్ ఆవశ్యకతను వివరిస్తూ, అదే సమయంలో సామాజిక దూరం పాటించాలన్న బాధ్యతను కూడా గుర్తుచేస్తూ మోడీ లాక్ డౌన్ సడలింపులు ప్రకటించే అవకాశముందని జాతీయ మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి. లాక్ డౌన్ కు సంబంధించి తాముచేసే అధికారిక ప్రకటనలే ఫైనలని ప్రభుత్వాలు ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications