మోదీని రాముడితో పోల్చిన సీఎం... రాబోయే రోజుల్లో ప్రధానిని కూడా అలాగే ఆరాధిస్తారని...
రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీని కూడా శ్రీరాముడి లాగే ప్రజలు ఆరాధిస్తారని ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ అభిప్రాయపడ్డారు. ఇదే సమాజం కోసం రాముడు కృషి చేశాడని... అందుకే ప్రజలు ఆయన్ను భగవంతుడని విశ్వసిస్తున్నారని చెప్పారు. ఇప్పుడిదే సమాజం కోసం నరేంద్ర మోదీ కూడా పనిచేస్తున్నారని... రాబోయే రోజుల్లో ఆయన్ను కూడా రాముడి అవతారంలా ఆరాధిస్తారని పేర్కొన్నారు. సోమవారం(మార్చి 15) ఉత్తరాఖండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రావత్ మాట్లాడారు.
గతంలోనూ పలువురు బీజేపీ నేతలు మోదీని ఆకాశానికి ఎత్తే స్థాయిలో కీర్తించినప్పటికీ... ఇలా ఏకంగా రాముడితో పోల్చడం,మోదీ కూడా రాముడిలా ఆరాధింపబడుతారని ఒక ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక పాల్గొన్న తొలి కార్యక్రమంలోనే రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదే కార్యక్రమంలో రావత్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కోవిడ్ 19 నిబంధనలు ఉల్లంఘించినందుకు 4500 మందిపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో జరిగే కుంభమేళ సందర్భంగా తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ కోవిడ్ 19 నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలను గంగలో మునిగి పవిత్ర స్నానాలు ఆచరించకుండా అడ్డుకోలేమని... అదే సమయంలో తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కోవిడ్ 19 లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరి గురించి పట్టించుకుందని... కుంభమేళ సమయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. మోదీ ఉంటే ఏదైనా సాధ్యమేనని అన్నారు.
గత వారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలే ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రి మారడం చర్చనీయాంశంగా మారింది. రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది పార్టీ నిర్ణయం అని స్పష్టం చేశారు. .నాలుగేళ్లు ఉత్తరాఖండ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు బీజేపీకి ధన్యవాదాలు చెప్పారు.
#WATCH | Lord Ram worked for the same society & people started to believe that He was a God. In the coming time, Narendra Modi will also be seen at par with Him (Lord Ram): Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/xjw04hSsai
— ANI (@ANI) March 15, 2021