Coronavirus: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ: పోరాటానికి సహకరిస్తామంటూ.. !
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే వంద మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇతర దేశాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. అత్యంత ప్రమాదకరంగా, భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ను నియంత్రించడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని భరోసా ఇస్తున్నాయి.

ఎలాంటి సహకారాన్నయినా..
తాజాగా- ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా చైనాకు నైతిక మద్దతు పలికింది. కరోనా వైరస్పై చైనా సాగిస్తోన్న పోరాటానికి అవసరమైన సహాయ, సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎలాంటి సహకారాన్నయినా అందించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం నరేంద్ర మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు లేఖ రాశారు. పలు అంశాలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.

ప్రధాని దిగ్భ్రాంతి..
చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 800కు దాటి పోయింది. 37,198 మంది చైనీయులు అనుమానిత కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 800 మందికి పైగా చైనీయులు మరణించడం పట్ల నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి ఘోర విపత్కర పరిస్థితుల్లో చైనాకు అండదండలను అందించడానికి వెనుకాడబోమని అన్నారు.

భారతీయుల తరలింపునకు సహకరించడం పట్ల..
కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీ సహా హ్యూబే ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో నివసిస్తోన్న వందలాది మంది భారతీయులను స్వదేశానికి తరలించడంలో సహకరించడం పట్ల నరేంద్ర మోడీ.. చైనా అధ్యక్షుడికి కృతజ్ఙతలు తెలిపారు. వేర్వేరు ప్రాంతాల నుంచి 647 మంది భారతీయులను తాము స్వదేశానికి తీసుకొచ్చామని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. భారతీయులను గుర్తించడంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అహర్నిశలు కృషి చేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications