ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న భారత ప్రభావానికి నిదర్శనం: ఆపరేషన్ గంగాపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన పౌరులను తరలించే లక్ష్యంతో చేపట్టిన 'ఆపరేషన్ గంగా' విజయవంతమైందని, ప్రపంచ స్థాయిలో భారత్కు పెరుగుతున్న ప్రభావం దీనికి కారణమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పుణెలోని సింబయాసిస్ యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఆపరేషన్ గంగా ద్వారా మేము వేలాది మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి సురక్షితంగా తరలిస్తున్నాము" అని మోడీ ఉటంకించారు. "భారతదేశం పెరుగుతున్న ప్రభావం కారణంగా ఇది ఉక్రెయిన్లోని యుద్ద ప్రాంతం నుంచి వేలాది మంది విద్యార్థులను వారి మాతృభూమికి తిరిగి తీసుకువచ్చింది," అని ప్రధాని మోడీ తెలిపారు. కాగా, పుణెలో మెట్రో రైలు ప్రారంభించిన ప్రధాని మోడీ.. మెట్రోలో విద్యార్థులతో కలిసి ప్రయాణించారు.
అనేక పెద్ద దేశాలు తమ పౌరులను తరలించడంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. శనివారం, ప్రభుత్వం ఒక ప్రకటనలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా యుద్ధ బాధిత ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 13,700 మంది పౌరులను సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. ప్రత్యేక విమానాలు గత వారం నుంచి ప్రారంభమయ్యాయి.
మిగిలిన విద్యార్థులనూ తీసుకొచ్చేందుకు ముమ్మర చర్యలు: తాజా అడ్వైజరీ
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన మిగిలిన భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను అక్కడి భారతీయ రాయబార కార్యాలయం మరోసారి అప్రమత్తం చేసింది. ఏయే ప్రదేశాల్లో ఉండిపోయారో వెంటనే తెలపాలని విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం ఉన్న ప్రాంతం, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ నెంబర్ తోపాటు మరిన్ని వివరాలతో కూడిన మరిన్ని వివరాలతో కూడిన దరఖాస్తు పూరించి వెంటనే తమకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ నగరాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నవేళ ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది.
కాగా, ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దేశాలైన పోలాండ్, హంగరీ, రొమేనియా, స్లోవేకియా నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక మిషన్ ముగింపు దశకు చేరుకున్నట్లు హంగరీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఎంబసీ ఏర్పాటు చేసిన బస కాకుండా, వేర్వేరు చోట్ల ఉన్న వారందరూ వెంటనే బుడాపెస్ట్కు చేరుకోవాలని సూచించింది.
మరోవైపు, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు 'ఆపరేషన్ గంగా' కార్యక్రమం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 5వ తేదీ నాటికి 13,700 మంది పౌరులను సురక్షితంగా తీసుకువచ్చింది.
ఆదివారం నాడు మరో 2వేల మందికిపైగా భారతీయులు స్వదేశానికి చేరుకోనున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 21వేల మంది ఉక్రెయిన్ సరిహద్దు దాటినట్లు బారత విదేశాంగ శాఖ తెలిపింది. పిసోచిన్, ఖార్కివ్ నగరాల నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా సరిహద్దు దేశాలకు తరలిస్తున్నప్పటికీ.. దాడుల తీవ్రత అధికంగా ఉన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన వారిని సవాలుగా మారింది. అయితే, రష్యా కాల్పులకు విరమణ ఇవ్వడంతో భారతీయులను వెంటనే సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవాలని ఎంబసీ వర్గాలు కోరాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు సరిహద్దులకు చేరుకున్నారు. భారత విద్యార్థుల తరలింపునకు ఉక్రెయిన్ తోపాటు రష్యా కూడా సహకరిస్తోంది.