నిద్రపోయే అధికారులపై వేటు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పని చెయ్యకుండా కాలం వెల్లదీస్తున్న ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు లోక్ సభలో మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకూ విధులు దుర్వినియోగం చేస్తున్న 13 మంది అధికారులను డిస్మిస్ చేశామని, 43 మంది అధికారుల ఫించన్ కట్ చేశామని వివరించారు.

విధుల నిర్వహణ, ప్రజాసేవలో ఆ అధికారుల పనితీరు అసంతృప్తిగా ఉండటం వలనే వారి మీద కఠిన చర్యలు తీసుకున్నామని అన్నారు. అసమర్థులైన అధికారుల మీద ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరపాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అన్నారు. 30 ఏళ్ల సర్వీసు పూర్తవడానికి ముందు ప్రతి ఉద్యోగికి కనీసం ఆరు సార్లు ఈ సమీక్ష జరగాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామని, పని చెయ్యని ఉద్యోగులకు రిటైర్ మెంట్ ఇప్పిస్తామని మంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications